బండి సంజయ్ దీక్ష భగ్నం, అరెస్టు

జాగరణ దీక్షకు పూనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ను పోలీసులు ఆదివారం  రాత్రి అదుపులోకి తీసుకుని దీక్షను భగ్నం చేశారు. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. 
 
ఉద్యోగుల బదిలీల్లో అమ్రాలు చోటుచేసుకుంటున్నాయని, 317జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో బండి సంజయ్ జాగరణదీక్ష తలపెట్టారు. సంజయ్ అరెస్ట్‌కు ముందు దీక్షా స్థలిలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు దీక్షా శిబిరంలోని కార్యకర్తలను బయటకు ఈడ్చుకెల్లారు. కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

దీంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీక్షా శిబిరానికి కరెంట్ కట్ చేసి.. అక్కడున్న టెంట్లను కూడా పోలీసులు తొలగించారు. అదే సమయంలో నాటకీయ పరిణామాల మధ్య బైక్ పై దీక్షా స్థలికి సంజయ్ చేరుకున్నారు. పోలీసులను తప్పించుకుని లోపలికి వెళ్లి జాగరణ దీక్ష ప్రారంభించారు. 

అర్ధరాత్రి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మానకొండూర్ పోలీస్ స్టేషన్ నుంచి  పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. రాత్రి కరీంనగర్ లోని ఎంపీ ఆఫీసులో దీక్షకు దిగిన సంజయ్ ని ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లాఠీచార్జీ చేసి, కార్యాలయం లోకి వాటర్ కెనాన్ ప్రయోగించి, గ్రిల్స్ ను గ్యాస్ కట్టర్ తో తొలగించి, రాడ్లతో డోర్లు పగులగొట్టి.. బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు జరిపిన లాఠీచార్జీలు పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. సంజయ్ ను రాత్రంతా మానకొండూరు స్టేషన్ లో ఉంచారు పోలీసులు. దీంతో స్టేషన్ లోనే సంజయ్ దీక్ష కొనసాగించారు. ఉదయం సంజయ్ ను మానకొండూర్ పోలీస్ స్టేషన్  నుంచి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు పోలీసులు తరలించారు. 

సంజయ్ కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. ఇందుకోసం అంబులెన్స్ ను తెప్పించారు. ఇక దీక్షపై చట్టపరంగా చర్యలకు సిద్ధమమైన  పోలీసు అధికారులు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద బండి సంజయ్ తో పాటు మరో 12 మంది నేతలు, ఇతర కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

అటు సంజయ్ అరెస్ట్ తో ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ. సంజయ్ అరెస్ట్ తీరుపై పార్టీ నాయకులు మండిపడ్డారు. సోమవారం ఉదయం 5 గంటల వరకు నిద్రపోకుండా జాగరణ చేసి నిరసన తెలుపుతామని సంజయ్ ముందే ప్రకటించారు.

తీరా దీక్షకు సిద్ధమయ్యే సమయంలో అనుమతి లేదంటూ కరీంనగర్ పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఎంపీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. బండి సంజయ్  మీడియాతో మాట్లాడుతుండగానే.. మీడియా ప్రతినిధులను కూడా బలవంతంగా అక్కడ్నుంచి పంపేశారు పోలీసులు.

బండి సంజయ్ జాగరణ దీక్షకు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేయడంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.