దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించే బిల్లు

ఇటీవల మత మార్పిళ్లకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చిన బొమ్మై ప్రభుత్వం తాజాగా మరో కీలక బిల్లు తెచ్చేందుకు యత్నాలు ముమ్మరం చేసింది. దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
 

హుబ్బళ్లిలో జరిగిన రెండు రోజుల రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, “ప్రస్తుతం, రాష్ట్రంలోని హిందూ దేవాలయాలు వివిధ రకాల నియంత్రణ చట్టాలు, నిబంధనలలో ఉన్నాయి. అధికారుల చేతుల్లో చిక్కుకున్న దేవాలయాలను మా ప్రభుత్వం విముక్తి చేస్తుంది. ఆలయ నిర్వహణకు వారి స్వంత అభివృద్ధిని చూసుకునే హక్కును కల్పించే చట్టాన్ని మేము తీసుకువస్తాము” అని ప్రకటించారు.

“మన ఆలయాలను రాష్ట్ర నియంత్రణ నుండి విముక్తి చేయడానికి మేము తదుపరి అసెంబ్లీ సమావేశాలలో  కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నాము. పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత త్వరలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటాము” అని వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే కొత్త చట్టాన్ని సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

“బడ్జెట్ సమావేశాలకు ముందు మన దేవాలయాలను ఆంక్షలు లేకుండా చేయడానికి చట్టం రూపొందిస్థాము. రాష్ట్రంలో ఎలాంటి నియంత్రణ లేదా నిబంధనలు లేకుండా ఆలయాలు స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతిస్తాం’’ అని ఆయన ప్రకటించారు.

అక్రమంగా బహిరంగ సభలలో నెలకొన్న దేవాలయాలను కాపాడుతూ ఒక బిల్లు తీసుకు రావడానికి తమ ప్రభుత్వం ఒక వారం సమయం మాత్రమే తీసుకున్నదని గుర్తు చేస్తూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వ అంకితభావంకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చెప్పారు. 
 కాగా, ప్రభుత్వ ఆధీనం తొలగితే భక్తుల విరాళాలతో దేవాలయాలు స్వయం సమృద్ధి సాధిస్తాయని కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర చెప్పారు. గత జులై 23న, కర్ణాటక ప్రభుత్వం హిందూ మతం, ధర్మాదాయ శాఖ (ముజ్రాయ్) డిపార్ట్‌మెంట్ నిధులను హిందూయేతర కారణాలకు లేదా ఏదైనా ఇతర మత సంస్థలకు ఆర్థిక సహాయం చేయడాన్ని నిషేధిస్తూ ఒక ఉత్తర్వును నోటిఫై చేసింది.

హిందూ దేవాలయాల నిధులను ఇతర మత సంస్థలకు మళ్లించడాన్ని రాష్ట్ర, జిల్లా ధార్మిక పరిషత్ సభ్యులు వ్యతిరేకించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకుని, డిపార్ట్‌మెంట్ ‘తస్తిక్’ మొత్తం లేదా వార్షిక గ్రాంట్ల నుండి నిధుల విచలనాన్ని నిరోధించింది.

మరోవైపు ప్రభుత్వ యత్నాన్ని తాము అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆర్ధికంగా బలంగా ఉన్న దేవాలయాలను సంఘ్ పరివార్‌కు అప్పగించాలనే కుట్రను హిందువులమైన తాము అడ్డుకుంటామని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు.