ప్రికాషన్ డోసుకు మెడికల్ సర్టిఫికెట్ అక్కర్లేదు

ముందుజాగ్రత్త (ప్రికాషన్) డోసు విషయంలో వృద్ధులకు కేంద్రం వెసులుబాటు కల్పించింది.60 ఏళ్లకు పైబడి, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవ్యక్తులు ఈ డోసు తీసుకునే ముందు ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ అందించాల్సిన పని లేదని తెలిపింది.  రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం అయిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. 

వైద్యుడి దగ్గర నుంచి తమ అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి పత్రాలు తీసుకు రాకపోయినా 60 ఏళ్లు పైబడిన వారు ముందు జాగ్రత్త డోసును తీసుకోవచ్చని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే టీకా తీసుకునే ముందు వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

అలాగే త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాల్లో ఎన్నికల విధులుల నిర్వర్తించనున్న సిబ్బందిని కేంద్రం ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించనున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రికాషన్ డోసు ఇవ్వడమనేది వారు ఎప్పుడు రెండో డోసు తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని, రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాతే వారు ప్రికాషన్ డోసు తీసుకోవడానికి అర్హులవుతారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో తెలిపారు. 

ప్రికాషన్ డోసుకు అర్హులైనవారికందరికీ ‘కోవిన్’ రిమైండర్ మెస్సేజిలు పంపిస్తుందని, డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో కూడా అది కనిపిస్తుందని ఆయన తెలిపారు. 15నుంచి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించడం,హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ముందు జాగ్రత్త మూడో డోసు ఇవ్వడంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో రాజేశ్ భూషణ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు.

15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కొవాగ్జిన్ టీకా మాత్రమే ఇస్తారని, ఇందుకోసం అదనపు టీకా డోసులను అన్ని రాష్ట్రాలకు పంపించడం జరుగుతుందని ఆయన చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ సరఫరా షెడ్యూల్‌ను కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేస్తుందని కూడా ఆయన తెలిపారు.

అర్హులైన లబ్ధిదారులు జనవరి 1నుంచి కొవిన్‌లో తామే రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదా, జనవరి 3నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పుడు వ్యాక్సినేషన్ సెంటర్‌కు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ గ్రూపు వారికి టీకాలు వేయడానికి రాష్ట్రాలు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సెంటర్లను గుర్తించవచ్చని, ఈ సెంటర్లు కొవిన్ యాప్‌లో కూడా కనిపిస్తాయని ఆయన చెప్పారు.

15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకా ఇచ్చేటప్పు్టడు టీకాల కోసం ఇప్పుడున్న అన్ని నియమ నిబంధనలను పాటించడం జరుగుతుందని కూడా రాజేశ్ భూషణ్ తెలిపారు. ఆదాయంతో సంబంధం లేకుండా పౌరులందరూ ఉచిత వ్యాక్సిన్‌కు అర్హులని, సొమ్ము చెల్లించగల స్థోమత ఉన్న వారు ప్రైవేటు ఆస్పత్రుల సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

ఇంతకు ముందు ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు నిర్ణయించిన ధరలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని కూడా రాజేశ్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో రాజేశ్ భూషణ్ తెలియజేశారు.