కేంద్రం ఆరు లక్షల టన్నుల బియ్యం కొనుగోలు

తెలంగాణలో వానాకాలం వడ్ల కొనుగోళ్లకు కేంద్రం భరోసా కల్పించింది. ఇంకో ఆరు లక్షల టన్నుల బియ్యం తీసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బియ్యం సేకరణ లక్ష్యాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి జైప్రకాశ్  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ ద్వారా సేకరించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య ఇదివరకే ఒప్పందం కుదిరింది. 
 
తాజా ఉత్తర్వుతో మొత్తం 46 లక్షల టన్నుల బియ్యం సేకరణకు అనుమతి లభించింది. రాష్ట్రంలో అక్టోబరు 25వ తేదీ నుంచి రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. మంగళవారం నాటికి 61.52 లక్షల టన్నుల సేకరణ పూర్తయింది. ధాన్యం కొనుగోళ్ల టార్గెట్‌ మించిపోవడంతో రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో ఆరు లక్షల టన్నుల బియ్యం తీసుకుంటామని ఉత్తర్వులిచ్చింది. 
 
దీంతో ఈ వానాకాలం వడ్లు ఇంకో పది లక్షల టన్నుల కొనడానికి లైన్‌ క్లియరైంది. ఈ లెక్కన రాష్ట్రంలో  69.60 లక్షల టన్నుల వడ్ల వరకు పర్మిషన్ లభించింది. ఇప్పటికే 61.52 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తవడంతో ఇంకో ఎనిమిది లక్షల టన్నులు కొనుగోలుకు అవకాశం కలిగింది. రాష్ట్రంలో ధాన్యం ఇంకా మిగిలినా.. అవసరానికి అనుగుణంగా టార్గెట్​మరింత పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
కేంద్రంపై నెపం వేసి రాష్ట్ర సర్కారు వడ్ల కొనుగోళ్లు జాప్యం చేసిందని, దీంతో పలువురు రైతులు వడ్ల కుప్పలపైనే ప్రాణాలు వదిలారని బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యుడు జి వెంకటస్వామి విమర్శించారు. కేంద్ర మంత్రి పార్లమెంట్‌ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని రాష్ట్ర మంత్రులు రచ్చ చేశారని అంటూ వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. 
 
కేంద్రం రాసి ఇవ్వకపోయినా.. ముందుగా చెప్పిన 40 లక్షల టన్నుల బియ్యానికి తోడు ఇంకో 6 లక్షల టన్నులు తీసుకుంటామని ఉత్తరువులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా వ్యవహరించిందో రైతులు, ప్రజలు గుర్తించారని చెప్పారు.