నా శవంపై నర్సింగ్‌ కాలేజీ కట్టండి

పేదల ఇళ్ల కోసం గద్వాలలో సేకరించిన భూమిని ముట్టు కుంటే వారి ఉసురు తగులుతుందని ధ్వజమెత్తుతూ తన శవంపైననే  నర్సింగ్‌ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణాలు చేపట్టాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ హెచ్చరించారు. 
 
 2012లో పేదల ఇళ్ల కోసం 78 ఎకరాల పట్టా భూమిని తాము సేకరించి ప్రభుత్వానికిచ్చామని ఆమె తెలిపారు. తనపై వ్యక్తిగత కక్షతో పేదల ఇళ్ల కోసం సేకరించిన భూములు గుంజుకోవటం అన్యాయమని ఆమె విమర్శించారు. మంత్రి హరీశ్‌రావు దొంగతనంగా గద్వాల వచ్చి నర్సింగ్‌ కాలేజీకి ఫౌండేషన్‌ వేశారని ఆమె ఆరోపించారు.
గద్వాల అభివృద్ధిపై మాట్లాడే అర్హత సీఎం కేసీఆర్, హరీశ్‌రావులకు ఆమె స్పష్టం చేశారు. హరీశ్‌ గద్వాల పర్యటనలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. యూనిఫాం వేసుకున్న పోలీసులు మానవత్వాన్ని కోల్పోతున్నారని మాజీ మంత్రి  మండిపడ్డారు.
కేసీఆర్, హరీశ్‌లను లాఠీలతో కొడితే ఆ బాధేంటో తెలుస్తుందని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అడిగినందుకు దాడులు చేయటం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.