దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే చూపించిన వాజపేయి

కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఏమిటో చూపించిన మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్​పేయి జయంతి ఉత్సవాల సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి, ఎమ్మల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ విజయశాంతి, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్త తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ..  పార్టీ జెండాను నమ్ముకుని 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి వాజ్ పేయి అని తెలిపారు. 

‘దేశాన్ని దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ  నాయకులు నియంత, కుటుంబ, అరాచక పాలనతో దేశాన్ని పట్టి పీడించారు.  పార్టీ జెండాను నమ్ముకుని 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి వాజ్ పేయి.  50 ఏళ్లు ఎంపీగా, 5  సార్లు జాతీయ అధ్యక్షులుగా కొనసాగిన నేత వాజ్ పేయి’ అని గుర్తు చేశారు. 

డబ్బులతోనే రాజకీయాలను శాసిస్తూ, పార్టీలు మారుతున్న ఈ కాలంలో.. కార్యకర్తలను, సిద్దాంతాలను నమ్ముకుని దేశానికి సుపరిపాలన అందించిన మహానేత వాజ్ పేయి అంటూ ఆయన  రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు. 

అద్వానీ, వాజ్ పేయి అత్యంత స్నేహపూర్వక సంబంధాలు అందరికీ ఆదర్శం అంటూ  గులాబీ చెట్టుకు ముళ్లు, పూల మాదిరిగా వాజ్ పేయి-అద్వానీ స్నేహ బంధాలుండేవని చెప్పారు. అణు పరీక్షలు నిర్వహించి భారత్ సత్తా చాటిన నేత వాజ్ పేయి అని,  కార్గిల్ యుద్దంలో విజయం సాధించి.. పాకిస్తాన్  ను దోషిగా నిలబెట్టారని గుర్తు చేశారు. 

విదేశీ సంబంధాలను మెరుగుపరచారని  చెబుతూ  దుష్ట కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల కోసం బీజేపీపై అనేక విమర్శలు చేసినప్పటికీ నమ్ముకున్న సిద్ధాంతాలకే కట్టుబడి, ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు నెరిపారని, ఐక్య రాజ్యసమితిలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రసంగించారని సంజయ్ వివరించారు. 

టెలిఫోన్ వ్యవస్థను పేద వాడి వరకు చేర్చి అతి తక్కువ ధరకే సెల్ ఫోన్ సేవలు అందేలా చేశారని, ప్రధాని అవాస్ యోజన ఇండ్ల నిర్మాణానికి ఆద్యుడు కూడా వాజ్ పేయి అని తెలిపారు. వాజ్ పేయి స్పూర్తితో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో శక్తవంతమైన భారత్ నిర్మాణమవుతోందని చెప్పారు. 

ఒకప్పుడు విదేశీ ప్రతినిధులకు తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చేవారని, కానీ నేడు విదేశీ ప్రతినిధులకు భగవద్గీత, శ్రీరాముడి ప్రతిమలను అందిస్తూ కొత్త ఒరవడిని సృష్టించిన నేత నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. 

దుర్గమ్మ వారిని, సీతమ్మ వారిని, శ్రీరామ చంద్రుడిని అవమానించిన మూర్ఖుడు స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీని కేటీఆర్ రాష్ట్రానికి ఆహ్వానించడం దారుణం అని సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఏలుతున్న భయంకరమైన హిందువుగా చెప్పుకునే కేసీఆర్.. తొలుత నాస్తికుడైన కొడుకు కేటీఆర్ ను కట్టడి చేయాలని హితవు చెప్పారు.

కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాస్తికులే అని సంజయ్ మండిపడ్డారు.   మునావర్ ఫారూఖీ వంటి మూర్ఖులకు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని స్పష్టం చేశారు. యువ మోర్చా నేతలు అలాంటి మూర్ఖుడు తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని పిలుపిచ్చారు. 

వాజ్ పేయి స్పూర్తితో శక్తివంతమైన తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తపైనా ఉందని సంజయ్ చెప్పారు.