మహిళా సాధికారతకు తాలిబానీ మనస్తత్వం ఆటంకం 

మహిళా సాధికారతకు తాలిబానీ మనస్తత్వం ఆటంకాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇటువంటి మనస్తత్వంగలవారు ట్రిపుల్ తలాక్‌ను శిక్షించదగిన నేరంగా చేయడాన్ని కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు.

తక్షణ ట్రిపుల్ తలాక్ దురాచారాన్ని శిక్షించదగిన నేరంగా పరిగణించడాన్ని, హజ్‌కు ముస్లిం మహిళలు ఒంటరిగా వెళ్ళడాన్ని వ్యతిరేకించేవారు భారత రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకించే ప్రొఫెషనల్ నిరసనకారులని కేంద్ర మంత్రి మండిపడ్డారు. వీరు మహిళల స్వేచ్ఛ, గౌరవ, మర్యాదలు, సాధికారతలను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

మహిళల వివాహ అర్హత వయసు పెంపును అడ్డుకుంటున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రపంచంలో ఉన్న మతాల్లో దాదాపు అన్నిటికీ చెందినవారు మన దేశంలో ఉన్నారని, అదేవిధంగా నాస్తికులు కూడా అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారని, వీరందరికీ గౌరవ, మర్యాదలతోపాటు, రాజ్యాంగ, సాంఘిక హక్కులు సమానంగా లభిస్తున్నాయని ఆయన చెప్పారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ళ నుంచి ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి’’ అనే నినాదంతో పని చేస్తోందని నక్వీ చెప్పుకొచ్చారు.  చెప్పుకోదగ్గ సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. 

దీంతో మైనారిటీలతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ‘హునార్ హాత్’ ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న స్థానిక వృత్తిపనివారికి భరోసానిచ్చిందని చెప్పారు. గడచిన ఆరు సంవత్సరాల్లో ఏడు లక్షల మంది వృత్తిపనివారికి ఉపాధి కల్పించామని వివరించారు. 

నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీలైన పారశీకులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, ముస్లింలకు చెందిన ఐదు కోట్ల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. లబ్ధిదారుల్లో 50 శాతం మంది విద్యార్థినులని చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేస్తుండటం వల్ల అర్థాంతరంగా చదువు మానేసేవారి సంఖ్య బాగా తగ్గిందని తెలిపారు. 

 మరీ ముఖ్యంగా ముస్లిం బాలికలు అర్థాంతరంగా చదువు మానేయకుండా ఈ పథకం దోహదపడుతోందని నక్వీ పేర్కొన్నారు. ముస్లిం బాలికలు అర్థాంతరంగా చదువు మానేసే పరిస్థితిని పరిశీలించినపుడు 2014కు పూర్వం 70 శాతం మంది అర్థాంతరంగా చదువు మానేసేవారని, ప్రస్తుతం ఇది 30 శాతం కన్నా తక్కువకు తగ్గిందని ఆయన వెల్లడించారు.  రానున్న రోజుల్లో ముస్లిం బాలికలు అర్థాంతరంగా చదువు మానేయకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.