సుప్రీంకోర్టు మాజీజడ్జి నానావతి మృతి

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి  జస్టిస్ గిరీశ్‌థకోర్‌లాల్ నానావతి (86) మరణించారు. శనివారం మధ్యాహ్నం  అహ్మదాబాద్‌లోని తన నివాసంలో నానావతి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1984లో ఢిల్లీలో సిక్కులపై జరిగిన హింస, 2002లో గుజరాత్‌లో ముస్లింలపై జరిగిన హింసపై నానావతి నేతృత్వంలోని కమిషన్ దర్యాప్తు జరిపింది. ఈ రెండు సంఘటనలు దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నది గమనార్హం. 

నానావతి గుజరాత్‌లోని భరూచ్‌జిల్లా జంబూసర్‌లో 1935, ఫిబ్రవరి 17న జన్మించారు. బాంబే హైకోర్టులో 1958లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1979లో గుజరాత్ హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 1994లో ఒడిషా చీఫ్‌జస్టిస్‌గా పదోన్నతి పొందారు.

1995లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులై 2000 ఫిబ్రవరి 16న రిటైర్ అయ్యారు. 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం ఢిల్లీలో సిక్కులపై జరిగిన హింసపై దర్యాప్తునకు వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 2000లో నానావతి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది.

2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తునకు నానావతి నతృత్వంలో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ  ఉన్నారు. ఆ రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభం కావడానికి ముందు గోద్రా రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్న కరసేవకుల(హిందువుల) సజీవ దహనం జరిగింది. 59 మంది కరసేవకులు ఆ సంఘటనలో మరణించారు.

2002 గోద్రాఅల్లర్లపై విచారణ జరిపిన జస్టిస్‌ నానావతి, అక్షరు మెహతాలు 2014లో తమ తుది నివేదికను అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనంది బెన్‌ పటేల్‌కు అందచేశారు. ఈ అల్లర్లలతో ముఖ్యమంత్రి మోదీకి గాని, బిజెపికి గాని, ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషద్ వంటి హిందూ సంస్థలకు గాని సంబంధం లేదని తన నివేదికలో స్పష్టం చేశారు.