నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని తెలిపే భగవద్గీత

భగవద్గీత పూజా, పునస్కారాల గురించి వివరించే గ్రంధం కాదని, మన నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి అంశాన్ని గురించి మనం ఏ విధంగా వ్యవహరించాలో తెలియచెప్పే సమగ్ర మహద్గ్రంథం అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. అనంతలక్ష్మి తెలిపారు.

సంస్కృత భారతి, తెలంగాణ ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాంప్రదాయ వేదిక, శిల్పారావంలో జరిగిన `సంపూర్ణ భగవద్గీతా పారాయణ యజ్ఞం – 2021’లో జరిపిన లక్ష యువ గళార్చనలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొంటూ భగవద్గీత కేవలం అర్జునుడు యుద్ధంలో గెలుపొందే విధంగా చేయడం కోసం శ్రీ కృష్ణుడు ప్రవహింప లేదని స్పష్టం చేశారు. ప్రముఖ రుగ్వేత పండితులు,  శ్రౌత్ర సంవర్ధనీ సభ అధ్యక్షులు, సంస్కృత భారతి తెలంగాణ అధ్యక్షులు బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే అధ్యక్షత వహించారు.

భారతీయులు అందరిలో అజ్ఞానాన్ని పారద్రోలి, విజ్ఞానం కలిగించే విధంగా చేసిన మహా ప్రయత్నం అని డా. అనంతలక్ష్మి తెలిపారు. నేడు భారత దేశంలోకన్నా ఇతర దేశాలలో పిల్లలకు భగవద్గీతను నేర్పించడం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, గీతలో గల సృష్టి రహస్యాలను ఛేదించడం కోసం పరిశోధనలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే గీత పుట్టిన మన దేశంలో గీతా పారాయణం చేయాలని ప్రోత్సహింప వలసి వస్తుండడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు.

భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉండగా, వాటిల్లో ఒక్క శ్లోకం తెలుసుకున్నా మానవ జీవనం తరిస్తుందని డా. అనంతలక్ష్మి స్పష్టం చేశారు. గీత చదివితే మనలో ఉన్న ధ్వని తరంగాలు  బాగా మేల్కొంటాయని ఆమె చెప్పారు. వాటిలో గల అర్ధం తెలుసుకో గలిగితే జీవితంలో మనం అన్ని రంగాలలో విజేయులం కాగలమని ఆమె భరోసా వ్యక్తం చేశారు. మనం విజయవంతంగా జీవనం సాగించడానికి అవసరమైన అన్ని కోణాలు గీతలో ఉన్నాయని ఆమె చెప్పారు.

ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఏ విధంగా వ్యవహరించాలో, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విషయంలో ఏ విధంగా విజయం సాధించాలో, మన ఉద్రిక్తలను – ఆవేశాలను ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలో, ఏ విధానాన్ని ఎంతమేరకు ఉపయోగించుకొని, ఏ మేరకు పక్కన పెట్టాలో … ఈ విధంగా అన్ని విషయాలు మనకు గీతా పఠనం ద్వారా అవగతం కాగలవని డా. అనంతలక్ష్మి వివరించారు.

మన దైనందిన ఆహార వ్యవహారాల దగ్గర నుంచి, వ్యక్తిత్వ వికాసం, విజయం పొందడానికి కావలసిన మంత్రాలు మనకు కర్తవ్య స్ఫురణ కలిగిస్తాయని ఆమె చెప్పారు.  అన్ని రంగాలలో మన దేశం, జాతి అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి, మనలోని శౌర్యం, పరాక్రమాలు వెలికి తీయడానికి భగవద్గీత కర్తవ్య బోధన చేస్తుందని ఆమె తెలిపారు.

గీత ప్రవచనంతో హిందువులలో చైతన్యం 

భగవద్గీత సారాన్ని మనకు అందించే ప్రయత్నం ఆది శంకరాచార్యుల నుండి ఎందరో సాధు, సంతతులు  చేస్తూ వచ్చారని ఆర్ ఎస్ ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ ముఖ్య వక్తగా పాల్గొంటూ గుర్తు చేశారు. స్వామి చిన్మయానంద పుణేలో కేవలం నలుగురితో గీతా పారాయణం ప్రారంభించి 50 ఏళ్ళ పాటు యావత్ ప్రపంచానికి గీతా సారాన్ని అందించే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు.

గీతా ప్రవచనాలతో స్వామి చిన్మయానంద దేశంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యం తీసుకు వచ్చారని, హిందూ సమాజంలో చైతన్యం కలిగించారని ఆయన కొనియాడారు. ముంబైలోని   స్వామిజి వారి సాందీపని ఆశ్రయంలోనే విశ్వ హిందూ పరిషద్ ఆవిర్భావం జరిగిందని, దీని ద్వారా హిందూ ధర్మ రక్షణకు సాదు, సంతతులు అందరూ ప్రతిన పునారని ఆయన పేర్కొన్నారు.

స్వామీజీ కృషితో సమస్త హిందూ సమాజం చైతన్యవంతమై అయోధ్యలో రామాలయ స్థాపనకు దోహదపడిందని, నేడు దేశంలో హిందువులలో ఒక నూతన జాగృతికి దారితీశారని చంద్రశేఖర్ తెలిపారు. ఏనాడో స్వామి రామతీర్థ 50 ఏళ్ళ తర్వాత దేశంకు స్వాతంత్య్రం వస్తుందని, ఆ తర్వాత 50 ఏళ్లకు సనాతన ధర్మ వైభవం ప్రారంభం అవుతుందని చెప్పారని; స్వామి వివేకానంద కూడా అటువంటి దృశ్యాన్ని దర్శించారని చెబుతూ వారి అభిలాషలు అన్ని నేడు కార్యరూపం దాల్చుతున్నాయని వివరించారు.

ప్రతి వ్యక్తి సంస్కృతం మాట్లాడవచ్చనే ప్రయత్నం సంస్కృత భారతి ద్వారా నేడు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు చంద్రశేఖర్ చెప్పారు. సంభాషణ భాషగా సంస్కృతంను అభివృద్ధి చేయడం కోసం కృష్ణ శాస్త్రి ప్రారంభిచిన ప్రయత్నం, నిరంతర కుర్షి కారణంగా నేడు కోటి మంది సంస్కృతంలో సంభాషణలు చేయగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

సంస్కృతి ప్రాశస్త్య గురించి సంస్కృత భారతి  దేశంలో జాగరణ ఏర్పాటు చేయగలుగుతుందని చెబుతూ సంస్కృతంలో నిక్షిప్తమై ఉన్న అపారమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించే కృషి నేడు పెద్ద ఎత్తున జరుగుతున్నదని తెలిపారు.

ప్రపంచంలో ప్రతి మనిషికి ఒకొక్క మనసత్త్వం ఉంటుందని పేర్కొంటూ ఎవ్వరికీ ఇష్టం వచ్చిన్నట్లు వారు నడుస్తుంటే ఇతరులతో ఘర్షణ అనివార్యం కాగలదని ప్రముఖ కవి, చలన చిత్ర గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తెలిపారు. అటువంటి ఘర్షణలు  ఏర్పడినప్పుడు మూలాన్ని గ్రహించి, ఏవిధంగా  నివారించాలో ఆలోచించి కొన్ని నియమాలను సమాజం ఏర్పాటు చేస్తుందని గుర్తు చేశారు.