తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామా!

‘తెలంగాణలో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామో… లేదో… అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని బిజెపి సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అయితే రోడ్డు మీద ప్రయాణం దైవాధీనంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

పూటుగా తాగి ఓవర్ స్పీడుగా వాహనాలు నడిపే కొందరు వ్యక్తుల వల్ల జీవితాలు నాశనమైపోతుంటే అధికార యంత్రాంగం గుడ్లప్పగించి చూస్తోంది తప్ప, ఇలాంటి ఘోరాలను నివారించే చర్యలను చిత్తశుద్ధితో అమలు చెయ్యడం లేదని ఆమె విమర్శించారు.

తాజాగా బంజారాహిల్స్‌, నార్సింగి, గండిపేట్, మాదాపూర్‌లలో  చోటు చేసుకున్న సంఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని,  పలువురు తీవ్ర గాయాలపాలయ్యారని ఆమె విచారం వ్యక్తం చేసారు. ఈ ఘటనలకు కారణమైన వ్యక్తులందరూ మద్యం సేవించినట్లు తనిఖీల్లో తేలిందని ఆమె గుర్తు చేశారు.

 గత కొన్నేళ్లలో డ్రంకెన్ డ్రైవర్ల కారణంగా ఇంకెన్నో పచ్చని కుటుంబాలు కుప్పకూలిపోయాయని ఆమెచెప్పారు . రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు మాత్రం ఒక నాలుగైదు రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో వరుస పెట్టి చెకింగులు, కౌన్సిలింగులు పెట్టి క్రమంగా నీరుగార్చేయడం మామూలైపోయిందని విజయశాంతి ధ్వజమెత్తారు దాంతో ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూ వస్తున్నాయని చెప్పారు. 

ఇదంతా ఇలా ఉంటే… బంజారాహిల్స్ ఘటనలో నిందితుడిని కాపాడేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగిన సమాచారాన్ని ఒక మీడియా సంస్థ వెల్లడించిందని ఆమె గుర్తు చేశారు. దాదాపు 5 ఏళ్ళ కిందట ఇలాంటి ఘటనకే బలైపోయిన చిన్నారి రమ్య ఉదంతంలో విచారణే ముందుగు సాగడం లేదంటూ ఆ కుటుంబం నేటికీ ఆవేదన చెందుతున్న దుస్థితి దాపురించిందని ఆమె విమర్శించారు. 

గతేడాది కాలంలో ఇలా మందుబాబుల క్రౌర్యానికి దాదాపు 800 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయని ఆమె చెప్పారు. నిందితులు అరెస్టయినా కొద్దిరోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని బయట తిరుగుతుండటం బాధిత కుటుంబాల్లో వేదన రెట్టింపు చేస్తోందని విచారం వ్యక్తం చేశారు.  ఇదిలా ఉంటే నిందితుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు విషయంలో రవాణాశాఖ తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఆమె మండిపడ్డారు.

ఇక నిబంధనలు ఉల్లంఘించే పబ్‌లపై చర్యలు ఇంకెంత గొప్పగా ఉన్నాయనేది చెప్పుకోవాల్సిన పనిలేదని ఆమె ఎద్దేవా చేశారు. హైదరాబాద్ విశ్వనగరమని… ఏదేదో చేసేస్తామని… గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాల పట్ల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవాల్సిన పనిలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.