సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీ కాలం ఐదేళ్ళకు పెంపు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్‌ల పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పెంచుతూ రెండు ఆర్డినెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం వీరి పదవీ కాలం రెండేళ్ళు మాత్రమే.
 
 నియామకం ప్రారంభంలో పేర్కొన్న పదవీ కాలం పూర్తయిన తర్వాత ఒకేసారి ఒక ఏడాది వరకు పొడిగించవచ్చునని, మొత్తం మీద ఐదేళ్ళ వరకు పొడిగించవచ్చునని ఈ ఆర్డినెన్సులు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ డైరెక్టర్లను రెండేళ్ళ నిర్ణీత కాలానికి నియమిస్తున్నారు. ఈ రెండేళ్ల పదవీ కాలం ముగియక ముందు వీరిని తొలగించడం సాధ్యం కాదు. ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత వీరి పదవీ కాలాన్ని పొడిగించవచ్చు.
తాజాగా విడుదల చేసిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2021 ప్రకారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ నియామకం ప్రారంభంలో నిర్ణయించిన పదవీ కాలం ముగిసిన తర్వాత క్లాజ్ (ఏ) ప్రకారం కమిటీ సిఫారసు చేసిన మీదట ప్రజా ప్రయోజనాల రీత్యా, లిఖితపూర్వకంగా రాయదగిన కారణం మేరకు ఒక ఏడాది వరకు పదవీ కాలాన్ని పొడిగించవచ్చు.
నియామకం ప్రారంభంలో నిర్ణయించిన పదవీ కాలంతోపాటు పొడిగించిన పదవీ కాలంతో కలిపి మొత్తం మీద పదవీ కాలం ఐదేళ్ళకు మించరాదు. ఇదే విధంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2021ను కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ రెండు ఆర్డినెన్సులు తక్షణం అమల్లోకి వచ్చాయి.

1997కు పూర్వం సీబీఐ డైరెక్టర్ పదవీ కాలాన్ని నిర్దిష్టంగా పేర్కొనలేదు. ప్రభుత్వం ఏ విధంగానైనా సీబీఐ డైరెక్టర్‌ను తొలగించే అవకాశం ఉండేది. అయితే సుప్రీంకోర్టు వినీత్ నారాయణ్ కేసులో ఇచ్చిన తీర్పులో సీబీఐ డైరెక్టర్ పదవీ కాలం కనీసం రెండేళ్ళు ఉండాలని తెలిపింది.