కేసీఆర్ ఒక అవినీతి సామ్రాట్… మోదీ పేరెత్తడమా!

కేసీఆర్ ఒక అవినీతి సామ్రాట్ అని, ఆయనకు ప్రధాని మోదీ పేరేత్తే అర్హత లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. మోదీ దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆమె తెలిపారు.  మోదీని కేసీఆర్ ప్రశ్నిస్తే తప్పులేనిది..తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు.
 
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా వ్యాపారుల నుండి కేసీఆర్ దోచుకున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఆ తర్వాత సంపాదించిన ఆస్తులెన్నో కేసీఆర్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ అహంకార ధోరణితో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అంటూ రాజకీయ నాయకులంటే కేసీఆర్ కు గౌరవం లేదని ఆమె ధ్వజమెత్తారు.
 
కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నిక సెగ బాగా తగిలిందని, ఉప ఎన్నిక  కేసీఆర్ కు కళ్లు తెరిపించిందని ఆమె చెప్పారు. కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పే సీఎం దేశంలో లేరని అంటూ కేసీఆర్ తెలంగాణ ద్రోహి..దేశ ద్రోహిగా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటుంటే..కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. 
 
మోదీ ప్రధాని అయ్యాక శత్రువులు ఇంచుభూమి కూడా ఆక్రమించుకోలేదని అరుణ స్పష్టం చేశారు. కేసీఆర్ సైనికులను కించపరిచే విధంగా మాట్లాడారని అంటూ ఓట్ల కోసం రాష్ట్రంలో రోహింగ్యాలను పెంచిపోషిస్తున్నారని ఆమె విమర్శించారు. మద్యం షాపులు విస్తరించడంతో కుటుంబాల్లో, గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కేసీఆర్ ప్రజల రక్తాన్ని పీల్చుకుని, లిక్కర్ ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నారని అరుణ ధ్వజమెత్తారు.  24 రాష్ట్రాల్లో పెట్రోల్ పై వ్యాట్ ను తగ్గిస్తే.. తెలంగాణలో ఎందుకు తగ్గించరో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యాట్ తగ్గించే వరకు కేసీఆర్ ను విడిచిపెట్టబోమని ఆమె స్పష్టం చేశారు. 
కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని ఆమె పేర్కొన్నారు. యాదగిరి గుట్ట పేరును యాదాద్రి అని మార్చారని అంటూ పాత పేర్లు ఏవి  ఉండకూడదని కేసీఆర్ ఉద్దేశమని ఆమె చెప్పారు. అదేవిధంగా, కేసీఆర్ కూడా దుబాయ్ శేఖర్ అని పేరు  మార్చుకోవాలని ఆమె ఎద్దేవా చేశారు.