పిల్లలకై కోటి డోసుల జైకోవ్‌-డీ టీకాలు

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా త్వరలో కొవిడ్‌ టీకాల పంపిణీ ప్రారంభం కానున్నది. 12 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా నుంచి కోటి డోసుల జైకోవ్‌-డీ వ్యాక్సిన్‌ కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఈ నెలలో జాతీయ కొవిడ్‌ టీకాల క్యాంపెయిన్‌లో చేర్చనున్నారు. టీకాలు ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఒక్కో వ్యాక్సిన్‌కు జైడస్‌ క్యాడిలా పన్నులు మినహాయించగా.. టీకా ధరను రూ.358 నిర్ణయించినట్లు సమాచారం. ఇందులోనే రూ.93 విలువైన టీకాను వేసే ‘జెట్‌ అప్లికేటర్‌’ను కూడా సరఫరా చేయనున్నది.

వ్యాక్సిన్‌ సూది రహితం కావడంతో.. ఈ జెట్‌ అప్లికేటర్‌ సహాయంతోనే టీకాను వేయనున్నారు. కంపెనీ నెలకు కోటి డోసుల జైకోవ్‌-డీ టీకాలను అందించే స్థితిలో ఉందని కంపెనీ అధికారులు మంత్రిత్వశాఖకు తెలిపారు.

ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత, మూడు డోసుల వ్యాక్సిన్‌. తొలి డోస్‌ తర్వాత 28 రోజులకు రెండో డోస్‌, 56 రోజులకు మూడో డోసు వేయనున్నారు. జైకోవ్‌-డీ వాక్సిన్‌కు ఆగస్ట్‌ 20న డ్రగ్‌ క్రంటోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదించిన విషయం తెలిసిందే. నీతి ఆయోగ్‌ సభ్యుడు (హెల్త్‌) డాక్టర్‌ వీకే పాల్‌ సెప్టెంబర్‌ 30న త్వరలోనే టీకాను దేశవ్యాప్తంగా కొవిడ్‌ టీకాల పంపిణీ కార్యక్రమంలో ఉపయోగించనున్నట్లు ప్రకటించారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. చైనా నా రష్యా సహా పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మూడో దశ భయాలు వెంటాడుతున్నాయి. అయితే భారత్ లో కరోనా మూడోవేవ్‌పై ఆందోళన అవసరం లేదని వైద్యారోగ్య నిపుణులు అంటున్నారు. ఏవై 4.2 వేరియంట్‌ అంతగా ప్రభావవంతమైంది కాదని చెబుతున్నారు.