నెహ్రూ, గాంధీలు దేశానికి రెండు కళ్ళ లాంటి వారైతే, సర్దార్ పటేల్ దేశానికి గుండె లాంటి వారని, ఆ గుండె ధృడ చిత్తంతోనే 565 సంస్థానాలు గా ఉన్న దేశం సమైక్య భారతం గా ఏర్పడిందని ప్రభుత్వ ఎంవిఎస్ డిగ్రీ కాలేజీ (మహబూబ్ నగర్) అసిస్టెంట్ ప్రొఫెసర్ జె. లక్ష్మయ్య గుర్తు చేశారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో “స్వతంత్ర భారత దేశంలో హైదరాబాద్ సంస్థానాల విలీనం – సర్దార్ పటేల్ పాత్ర” పై ఏర్పాటు చేసిన వెబినార్ లో ముఖ్య వక్తగా పాల్గొంటూ ఈనాటి సువిశాల భారతదేశపు రూపురేఖలను కలగని, ఆ కలను నిజం చేసి చూపిన మహానాయకుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని పేర్కొన్నారు.
ఆ ఉక్కు మనిషి ఆధునిక భారతావనికి ఆది శిల్పి. ఆయన దృఢ సంకల్పం, ధైర్యసాహసాలే లేకుంటే హైదరాబాద్ రాష్ట్రం భారత సంస్థానం లో విలీనమై ఉండకపోయేదని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో అస్తవ్యస్థంగా ఉన్న భారతదేశపు పరిస్థితులను త్రోసిరాజని వివిధ సంస్థానాలు తమ ఉనికిని స్వతంత్ర భారతదేశంలో కూడా నిలుపుకోవాలనుకున్నాయని చెప్పారు
జాతీయ సమైక్యత నెలకొల్పడానికి సర్దార్ వల్లభభాయి పటేల్ చేసిన ప్రయత్నం హిమాలయ శిఖరంతో సమానమని పేర్కొంటూ సర్దార్ పటేల్ వారి కుట్రలను, కుయుక్తులను ఛేదించి ఆ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి విశాల భారతాన్ని నెలకొల్పారని గుర్తు చేశారు.
అయితే, అన్ని సంస్థానాల కంటే పెద్దదిగా ఉన్న హైదరాబాద్ భారత్ లో కలవడానికి సిద్ధపడలేదని, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా స్వతంత్రంగా ఉండటానికి భీష్మించుకున్న నిజాంకు పటేల్ అనునయ వ్యాఖ్యలు రుచించలేదని చెప్పారు. దానితో చివరగా భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యకు దిగాల్సి వచ్చిందని తెలిపారు.
మూడు రోజుల పోరులో ఓటమిని అంగీకరించిన నిజాం హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేశాడని వివరించారు. ఇది జరిగింది 1948 సెప్టెంబర్ 17న. ఈ విధంగా స్వతంత్ర భారతంలో జరిగిన రాచరిక రాజ్యాల విలీన ప్రక్రియను సర్దార్ పటేల్ ‘రక్తరహిత విప్లవం’గా ఆయన అభివర్ణించారు.
ప్రపంచ చరిత్రలో జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎలాంటిదో విశాల భారత నిర్మాణంలో పటేల్ భూమిక అలాంటిది అని లక్ష్మయ్య తెలిపారు. అందుకే ఆయనకు మహాత్మా గాంధీ ఉక్కు మనిషి బిరుదును అందించారని పేర్కొన్నారు.
దేశ స్వాతంత్య్రం తరువాత అఖిల భారత సివిల్ సర్వీసులను దేశ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించేలా పునర్ వ్యవస్థీకరించిన ఘనత పటేల్ కు దక్కుతుందని లక్ష్మయ్య చెప్పారు. దేశాన్ని ముక్కలు కాకుండా నిలువరించి ‘‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’’ గా ఆవిష్కృతం చేసిన ‘ఏకతామూర్తి’ సర్దార్ పటేల్ అని కొనియాడారు.
పటేల్ మార్గాన్ని ఈనాటి తరం అనుసరించేలా భారత ప్రభుత్వం 2014 నుండి అక్టోబర్ 31 ని ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ గా ప్రకటించిందని లక్ష్మయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.
More Stories
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన
తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి