రూ 44 వేల కోట్ల జీఎస్‌టీ నష్టపరిహారం రుణాలు

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నష్టపరిహారం భర్తీ కోసం సొమ్ము చెల్లించడానికి బదులుగా రుణం క్రింద రూ.44,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు క్రింద ఇచ్చిన రుణాల మొత్తం రూ.1.59 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 
 కాగా, జీఎస్టీ ప‌రిహారం కింద తెలంగాణ‌కు రూ.1264.78 కోట్లు, ఏపీకి రూ.905.59 కోట్ల మేర‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ  విడుద‌ల చేసింది. 2021 మే 28న జరిగిన 43వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఈ రుణాలను విడుదల చేసినట్లు తెలిపింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.59 లక్షల కోట్లు అప్పు చేసి, దానిని రాష్ట్రాలు, చట్ట సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు బ్యాక్-టు-బ్యాక్ ప్రాతిపదికపై రుణంగా అందజేయాలని 43వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. 

జీఎస్‌టీ కంపెన్సేషన్ ఫండ్‌కు వసూలైన నిధులు తగ్గినందువల్ల నష్టపరిహారం భర్తీలో లోటు ఏర్పడింది. ఫలితంగా ఏర్పడిన వనరుల లోటును భర్తీ చేయడం కోసం ఈ రుణాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. 

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై 15న రూ.75,000 కోట్లు; అక్టోబరు 7న రూ.40,000 కోట్లు రుణంగా విడుదల చేసింది. గురువారం రూ.44,000 కోట్లు విడుదల చేసింది. సుంకాల వసూళ్ళ నుంచి రెండు నెలలకోసారి చెల్లించే జీఎస్‌టీ నష్టపరిహారానికి ఇది అదనం.