`తెలుగు’ ప్రాజెక్టుల పరిశీలనకు కేంద్ర బృందాలు

తెలుగు రాష్ట్రాలలోని  కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న ప్రాజెక్టులను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలును ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘంలోవున్న అధికారులతో ఏర్పాటు చేసిన ఈ బృందాలు ఈ నెల 25నుంచి తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్నాయి.

ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేష్ అమలులో చిక్కుముడులు వీడటం లేదు. ప్రాజెక్టుల పరిధిని నిర్ణయిస్తూ గెజిట్‌లో పొందు పరిచిన అంశాలను మార్చాలని, నదీజలాల్లో రాష్ట్రాల వాటా తేల్చేదాక గెజిట్ అమలును నిలిపి వేయాలని కోరుతూ తెలుగు రాష్ట్రాలు చేసిన అభ్యర్ధనలను కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయటం లేదు.

ఈ నెల 14నుంచే గెజిట్ అమల్లోకి వచ్చిందని కేంద్రం ప్రకటించింది. అయితే ఇటు కృష్ణానదీ పరివాహకంగా, అటు గోదావరి నదీ పరివాహకంగా ఉన్న ప్రాజెక్టులను తెలంగాణ , ఆంధ్రపదేశ్ రాష్ట్రాలు బోర్డులకు అప్పగించటంలో పడ్డ చిక్కుముడులు ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు. 

ఈ అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ సయుంక్త కార్యదర్శి దేవశ్రీ ముఖర్జి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లతో మాట్లాడారు. తెలంగాణ , అంధ్రప్రదేశ్ ప్రభుత్వాలనుంచి వ్యక్తమైన అభిప్రాయాలు, ప్రాజెక్టులను బోర్డులకు అప్పగింతలో పెట్టిన షరతులు , ఇతర సమస్యలపై చర్చించారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర జలసంఘం అధికారులతో రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

ఢిల్లీ నుంచి చీఫ్ ఇంజనీర్ అతుల్ కుమార్ నేతృత్వంలో కేంద్ర జలసంఘం నుంచి ఐదుగురు ఇంజనీర్లు, గోదావరి నదీయాజమాన్య బోర్డు నుంచి మరో ఇద్దరు ఇంజనీర్లతో కూడిన బృందం ఈ నెల 25నుంచి తెలంగాణ రాష్ట్రలో పర్యటించనుంది. మూడు రోజుల పాటు గోదావరి నదీపరివాహక ప్రాంతం పరిధిలోని ప్రాజెక్టులను పరిశీలించనుంది.

ఇందులో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టులను సందర్శించనున్నారు. మరో వైపు కృష్ణానది పరివాహక ప్రాంతం పరిధిలొని ప్రాజెక్టులను పరిశీలించేందుకు మరో బృందం కూడా ఈ నెల 25న రాష్ట్రానికి రానుంది. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనుంది. శ్రీశైలం , నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులు, వాటి రెగ్యులేటర్లు, జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఎత్తిపోతల పథకాల పంపుహౌస్‌లను పరిశీలించనుంది.