బాంగ్లాలో యుఎన్ జోక్యం… నేడు వి హెచ్ పి నిరసనలు 

బంగ్లాదేశ్‌లోని స్వదేశీ హిందువులపై నిరంతర జిహాది మారణహోమాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ  దళంను పంపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. అక్కడ హిందువులపై రాడికల్ ఇస్లామిక్ జిహాదీలు, మత ఛాందసవాదులు చేస్తున్న దారుణాలను నాజీల కౄరత్వంతో మాత్రమే పోల్చవచ్చని పరిషత్ కేంద్ర సంయుక్త కార్యదర్శి డా. సురేంద్ర జైన్ స్పష్టం చేశారు.

హిందువులపై క్రూరమైన దౌర్జన్యాల క్రమం ఆగే పరిస్థితులు కనిపించనందున ఇప్పుడు యుఎన్ జోక్యం చేసుకోవాలని, అక్కడ తీవ్రమైన వేధింపులకు గురవుతున్న హిందువులకు ఎటువంటి ఆలస్యం లేకుండా రక్షణ కల్పించాలని ఆయన కోరారు. అక్కడి జిహాదీల అకృత్యాలకు నిరసనగా బుధవారం భారత దేశంలో దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు వి హెచ్ పి పిలుపిచ్చింది.

న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు భారీ నిరసన ప్రదర్శన కూడా జరుపనుంది. హిందువులపై క్రూరమైన అఘాయిత్యాలను ఖండిస్తూ, ప్రధాన మంత్రి షేక్ హసీనా తన రాజ్ ధర్మాన్ని పాటించాలని,  మైనారిటీ హిందూ సమాజం భద్రతను నిర్ధారించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని పరిషత్ కోరింది.

బాంగ్లాదేశ్ పరిణామాల పట్ల ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వైకల్యం ప్రదర్శిస్తున్నాయని డా. జైన్  విమర్శించారు. బంగ్లాదేశ్‌ను పూర్తిగా హిందువులు లేని దేశంగా మార్చడానికి ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిగా మారిందని డా. జైన్ ధ్వజమెత్తారు. 

రాడికల్ జిహాదీలను నియంత్రించే బదులు, భారత్ లో అటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా చూడాలని అంటూ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారత ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. షేక్ హసీనా ఈ ప్రకటన తరువాత, ఆ దేశంలో ముస్లిం ఫండమెంటలిస్టులు మరింత ఉన్మాదంగా మారారని, హిందువులపై క్రూరమైన దౌర్జన్యాలు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ దేశం అని ప్రకటించుకున్నదని, అందుకనే , ఆఫ్ఘనిస్తాన్,  పాకిస్తాన్ లలో వలె బంగ్లాదేశ్‌లో మొదటి నుండి హిందువులపై దారుణమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని డా. జైన్ తెలిపారు. అయితే ప్రస్తుత పరిణామాలు మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

గత 10 రోజుల్లోనే 150 కి పైగా తల్లి దుర్గా పూజ పండళ్లు ధ్వంసం చేసారని,  362 కి పైగా దేవతలను ధ్వంసం చేశారని, హిందువుల వేలాది ఇళ్లు, దుకాణాలు దాడికి, దోపిడీకి గురయ్యాయని వివరించారు. 1,000 మందికి పైగా హిందువులు గాయపడ్డారని,  ఇప్పటి వరకు 10 మంది హిందువులు కూడా మరణించినట్లు చెబుతున్నారని తెలిపారు. 

చాలా మంది హిందూ మహిళలు దారుణంగా సామూహిక అత్యాచారానికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్‌పూర్‌లోని హాజీ గంజ్‌లో, ఒక మహిళ, ఆమె కుమార్తె,  ఆమె మేనకోడలు/సోదరి కుమార్తెపై దారుణంగా సామూహిక అత్యాచారం జరిగిందని, ఒక అమాయక 10 ఏళ్ల బాలిక అక్కడ మరణించిందని డా. జైన్ పేర్కొన్నారు.

మూడు ఇస్కాన్ దేవాలయాలు, రామకృష్ణ మిషన్ ఆశ్రమాలు, రామ్ ఠాకూర్ ఆశ్రమంతో సహా 50 కి పైగా దేవాలయాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇస్కాన్‌కు చెందిన ఇద్దరు సాధువులు,  చౌమోహిని ఆలయానికి చెందిన ముగ్గురు పూజారులు దారుణ హత్యకు గురయ్యారని తెలిపారు. ఇస్కాన్ ఆలయ చెరువులో  మరో పూజారి మృతదేహం లభ్యమైందని చెబుతూ ఇంటర్నెట్ ఆంక్షల కారణంగా అనేక జిల్లాల నుండి పాక్షిక వార్తలు మాత్రమే  అందుతున్నాయని వివరించారు.  హిందువులపై ఇటువంటి అఘాయిత్యాలు రాడికల్ ఇస్లామిక్ పాత్రలో భాగమయ్యాయని, ఇది ప్రస్తుత బంగ్లాదేశ్‌లో క్రమంగా తగ్గుతున్న హిందువుల జనాభాకు నిదర్శనమని ఆయన తెలిపారు.

తూర్పు పాకిస్తాన్‌లో హిందూ జనాభా 1951 లో 22 శాతం; 1971 లో బంగ్లాదేశ్ ఏర్పడిన సమయంలో 18 శాతం ఉండగా,  అది ఇప్పుడు కేవలం 7 శాతం కు తగ్గిన్నట్లు డా. జైన్ తెలిపారు. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత కూడా, హిందువులపై ఇస్లామిక్ దౌర్జన్యాలు ఆగకపోగా,  వేగంగా పెరిగాయని ఇది రుజువు చేస్తుందని స్పష్టం చేశారు.  1971 లో తొమ్మిది నెలల పాటు జరిగిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో, పాకిస్తాన్ సాయుధ దళాల సభ్యులు,  అప్పటి నుండి పాకిస్తాన్ అనుకూల ఇస్లామిస్ట్ మిలీషియాలకు మద్దతు ఇస్తూ, బెంగాలీలందరిపై ఇలాంటి అమానవీయ దురాగతాలు జరిగాయని ప్రపంచం మొత్తం తెలుసని గుర్తు చేశారు.

తూర్పు పాకిస్తాన్ జమాత్-ఇ-ఇస్లామీ 30 లక్షల బెంగాలీలను చంపిందిని,  400,000 బెంగాలీ మహిళలపై అత్యాచారం చేసిందని పేర్కొన్నారు. ఈ అమానవీయ పరిస్థితిని వదిలించుకోవడానికి, భారతదేశం ముక్తి బాహినికి సహాయం చేసి, బాంగ్లాదేశ్ ఏర్పాటుకు దోహదపడినదని తెలిపారు. అయితే  పాకిస్తానీ దురాగతాలను వదిలించుకున్న తరువాత, బంగ్లాదేశ్ ముస్లిం సమాజం నిజమైన స్వభావం తెరపైకి వచ్చిందని డా. జైన్ ధ్వజమెత్తారు.

హిందువులపై ఈ అమానవీయ దురాగతాలను హిందూ సమాజం ఇంకేమాత్రం  సహించదని డా. జైన్ హెచ్చరించారు. తాము అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలో నిలబడాలనుకుంటే, తమ రాడికల్ ఇమేజ్ నుండి విముక్తి పొందాల్సి ఉంటుందని పరిషత్ బాంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తీవ్రవాదులను 1971 లో వలె నిర్ధాక్షిణ్యంగా అణచి వేయాలని, అందుకు అవసరమైతే, భారత ప్రభుత్వ సహాయం కూడా తీసుకోవాలని డా. జైన్ సూచించారు.