రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి కార్యకర్తలు టిడిపి కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరిపి, విధ్వంసం సృష్టించినందుకు నిరసనగా టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు నేడు రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చారు. బంద్ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను మోహరింపచేశారు. టిడిపి నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పలువురు నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. పలు చోట్ల టిడిపి కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్విదాలు జరుగుతున్నాయి.
టిడిపి అధికార ప్రతినిధి కె పట్టాభిరామ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో విమర్శించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం… కర్రలు, ఇనుపరాడ్లతో కార్యాలయంలోకి ప్రవేశించిన వైసిపి కార్యకర్తలు భయానక వాతావరణం సృష్టించారు. గేటు వద్దే అడ్డుకోబోయిన టిడిపి కార్యకర్తను జాతీయ రహదారిపైకి తీసుకొచ్చి రోడ్డుపైకి నెట్టడంతో అదే సమయంలో అటుగా వెళుతున్న లారీ తగిలి గాయపడ్డారు.
బద్రీ అనే కార్యకర్త తలపై కొట్టడంతో అపస్మాకరకస్థితిలోకి వెళ్లిపోయారు. మరో ఇద్దరు కార్యకర్తల చేతులు విరగ్గొట్టారు. కార్లను ధ్వంసం చేశారు. విజయవాడలోని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి ఇంట్లో చొరబడి వస్తువులన్నీ పగులకొట్టి విధ్వంసం సృష్టించారు.
అయితే డీజీపీ కార్యాలయంపై కూతవేటు దూరంలోని తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై విధ్వంసం జరపడం, తాను ఫోన్ చేసినా డిజిపి స్పందించక పోవడంతో ముఖ్యమంత్రికి… డీజీపీకి తెలిసే ఈ దాడి జరిగింది టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయాలపై దాడి చేసి అక్కడ ఉన్నవారిని చంపాలని చూడటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రపతి పాలన విధించడానికి ఈ దారుణం చాలదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాయోజిత టెర్రరిజం రాష్ట్రంలో నడుస్తోందని, రౌడీలకు ప్రభుత్వమే పోలీసులతో రక్షణ కల్పించి దాడులకు పంపించే దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. గంజాయి సాగు… రవాణా… మాదక ద్రవ్యాల వ్యాప్తి పెరిగిపోతే దాని గురించి మాట్లాడే స్వేచ్ఛ ప్రతిపక్ష పార్టీగా తమకు లేదా అని చంద్రబాబు నిలదీశారు.
More Stories
సీఎం జగన్ను హత్య చేసేందుకే దాడి
వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కడప కోర్టు
సీఎం జగన్పై రాయి దాడి కేసులో సతీష్ అరెస్ట్