యూపీ డిప్యూటీ స్పీకర్‌గా ఎస్పీ తిరుగుబాటు అభ్యర్థి

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంఎల్‌ఎ నితిన్ అగ్రావాల్ ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా సోమవారం ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బిజెపి బలపరిచింది. తమ పార్టీ అధికార అభ్యర్థి నరేంద్ర వర్మను ఆయన ఓడించారు. 
 
పోలయిన మొత్తం 364 ఓట్లలో నితిన్‌కు అనుకూలంగా 304 ఓట్లు రాగా, ఎస్‌పి బలపరిచిన అభ్యర్థి నరేంద్ర వర్మకు 60 ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ తిరుగుబాటు ఎంఎల్‌ఎ అయిన నితిన్ అగ్రావాల్ 2019 నుంచే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ఇతర మంత్రులు వెంటరాగా నితిన్ అగ్రావాల్ తన నామినేషన్ పేపర్లు దాఖలు చేశారు.
 
సమాజ్‌వాదీ పార్టీ సీతాపూర్ శాసనసభ్యుడు నరేంద్ర వర్మను నిలబెట్టింది. ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రామ్‌గోవింద్ చౌదరి, ఇతర ఎస్‌పి శాసనసభ్యులు, బిఎస్‌పి తిరుగుబాటు నాయకుల సమక్షంలో తన నామినేషన్ పేపర్లు దాఖలు చేశారు.

2019లో ప్రతేక అసెంబ్లీ సమావేశంలో పార్టీ విప్‌ను ఉల్లంఘించినందుకుగాను నితిన్ అగ్రావాల్‌ను సభ నుంచి అనరుడిగా ప్రకటించాలని కోరుతూ సమాజ్‌వాదీ పార్టీ పెట్టుకున్న దరఖాస్తును అసెంబ్లీ స్పీకర్ ఇటీవల తిరస్కరించారు.  
ఇదిలా ఉండగా ఆయన అభ్యర్థిత్వం విషయంలో బిజెపిపై ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చుతూ తమ పార్టీ  ‘పార్లమెంటరీ సంప్రదాయాలను మన్నించింది’ అని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. 
 
“సాంకేతికంగా చూసినట్లయితే ఆయన ఇప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ ఎంఎల్‌ఎనే” అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేశ్ ఖన్నా గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లుగా డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత కుమ్ములాటల కారణంగా తమ అభ్యర్థిని సూచించక పోవడంతో తాము ప్రతిపక్షం నుండే ఒక అభ్యర్థిని ఎన్నుకున్నామని ఆయన తెలిపారు.  ఈ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది.