ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గంజాయి స్మగ్లర్ల రాజ్యం 

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులతో పాటు ఇప్పుడు గంజాయి స్మగ్లర్లు సహితం రాజ్యమేలుతున్నారు. ఇక్కడి నుండి గంజాయి హైదరాబాద్ మీదుగా దేశంలో వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పలుకుబడిగల కొన్ని వర్గాల అండదండలతోనే యధేచ్చగా వీరి కార్యకలాపాలు సాగుతున్నట్లు భావిస్తున్నారు. 

వీరి ఉనికి గ్రహించి,  లంబసింగిలో గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన నల్గొండ టాస్క్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు సిఐలు, నలుగురు కానిస్టేబుళ్లపై ఆదివారం నాడు దాదాపు 20 మంది గంజాయి స్మగ్లర్లు మూకుమ్మడిగా రాళ్ల దాడీకి పాల్పడ్డారు. దానితో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు స్మగ్లర్లు గాయపడ్డారు. 

వారికీ విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. మిగతా స్మగ్లర్లు పరారయ్యారు. పోలీసులు గాలిలో పది రౌండ్ల వరకు కాల్పులు జరపడంతో స్మగ్లర్ల ముఠాలోని ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. స్మగ్లర్లు రాళ్ల దాడి చేయడంతో ముగ్గురు పోలీసులకు కూడా గాయలయ్యాయి. 

బుల్లెట్ల దాడిలో గాయపడిన చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ, గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో కామరాజు, రాంబాబును నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇటీవల పట్టుబడిన గంజాయి ముఠాలోని ఓ సభ్యుడు(నిందితుడు) ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి ముఠాను పట్టుకునేందుకు నల్గొండకు చెందిన పోలీసులు శనివారం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. ఎవొబి

లంబసింగి ప్రాంతంలో గంజాయి స్మగ్లర్ల కోసం ఆదివారం ఉదయం నుంచి వేట సాగించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా బార్డర్ కొయ్యూరు మండలం తులబాయిగడ్డ వద్ద ఇద్దరు సిఐలు, నలుగురు కానిస్టేబుళ్లు గంజాయి స్మగ్లర్ల కోసం గాలిస్తుండగా 20 మంది పోలీసుల కంట పడ్డారు.

గంజాయి స్మగ్లర్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకోవడంతో స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఈక్రమంలో పోలీసులు రావడాన్ని గమనించిన స్మగ్లర్లు వెంటనే అప్రమత్తమై రాళ్ల దాడి చేశారు దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఏకంగా తమను వెంటాడుతున్న పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు.

విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగిలో చోటుచేసుకున్న ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. విశాఖ లంబసింగి ప్రాంతంలో పోలీసులపై రాళ్లదాడులు జరిపి పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

గంజాయి ఎక్కువగా రవాణా అవుతుండడంతో 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసు టీమ్‌లు విశాఖ జిల్లాలోని లంబసింగి, నర్సీపట్నం అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఇక్కడి నుండి గంజాయిని హైదరాబాద్ కు తరలించి, అక్కడ ద్రవరూపంగా మార్చి, ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తున్నది.