అనుసంధానతే అభివృద్ధికి మొదటి మార్గం

అనుసంధానతే అభివృద్ధికి మొదటి మార్గమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు.  త్రిపుర రాజధాని అగర్తలాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దిశగా త్రిపుర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
తద్వారా ఈ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి బాటలు పడుతున్నాయని తెలిపారు. రైలు, జల రవాణాతోపాటుగా వాయుమార్గ అనుసంధానత కోసం కూడా కార్యాచరణ వేగంగా అమలవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కిసాన్ రైల్ నెట్‌వర్క్‌ బలోపేతం కారణంగా ఈశాన్యభారతం రైతులు తమ ఉత్పత్తులను ఢిల్లీ, కోల్‌కతాతోపాటు దేశంలోని అన్ని మూలలకు పంపించేందుకు వీలుపడిందని చెప్పారు. తద్వారా ఇక్కడి రైతు సాధికారతకు బాటలు, పరిశ్రమల అభివృద్ధికి పడుతున్నాయన్నారు.
 
దేశవ్యాప్తంగా పట్టణీకరణ వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ మార్గంలో సరికొత్త అవకాశాలను వెతుక్కోవాల్సిన అవకాశం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. గృహనిర్మాణం, మురుగునీటి శుద్ధి, ఇతర అత్యవసరసేవల కల్పన తదితర అంశాలకు సంబంధించి.. పట్టణీకరణ ప్రణాళిక, అభివృద్ధిపై మరింత దృష్టిసారించాల్సిన అవసరముందని చెప్పారు.
.
అనంతరం, స్వయం సహాయక బృందాల ప్రతినిధులతో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ మహిళాసాధికారత, దేశాభివృద్ధిలో స్వయం సహాయక బృందాలు చేస్తున్న కృషిని మరువలేమని తెలిపారు. త్రిపురలోని ఈ బృందాల సభ్యులు ఈ దిశగా మరో అడుగు ముందే ఉన్నారని ఆయన ప్రశంసించారు. 
 
బృంద సభ్యుల నైపుణ్యాన్ని పెంచేందుకు చొరవతీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని.. గ్రామస్వరాజ్యం ద్వారానే అన్ని వర్గాల సాధికారత సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

త్రిపుర రాష్ట్రంలో కరోనా టీకాకరణ 95 శాతం పూర్తవడాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.  మన చేతివృత్తులు, కళలు భారతదేశ సంస్కృతి ప్రత్యేకతన్న ఉపరాష్ట్రపతి, వీటిని కాపాడుకోవడం మన బాధ్యతని సూచించారు. ఈ అంశాల్లో అంతర్జాతీయ స్థాయి పద్ధతులను కూడా అలవర్చుకోవడం ద్వారా మరింత నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు వీలవుతుందని చెప్పారు.