తాలిబన్ల కట్టడికి అమెరికా బిల్లు…. పాక్ పై పిడుగుపాటు!

తాలిబన్ల కట్టడికి అమెరికా బిల్లు…. పాక్ పై పిడుగుపాటు!

తమకిచ్చిన హామీలకు తిలోదకాలిచ్చి ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు సాగిస్తున్న అకృత్యాల పట్ల అమెరికా ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. ఎట్లాగైనా సరే తాలిబన్లను కట్టడి చేయాలనే పట్టుదల పెరుగుతున్నది. ఈ పట్టుదలే తాలిబాన్లకు అండగా నిలుస్తున్న పాకిస్థాన్ పై పిడుగుపాటుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 

అమెరికన్‌ సెనేట్‌లోని 22 మంది రిపబ్లికన్‌ సభ్యులు ప్రవేశపెట్టిన ఒక బిల్లుకు ఆమోదం లభిస్తే తొలుత పాకిస్తాన్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లయితే పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ నాశనం అవడం ఖాయం అని నిపుణులు స్పష్టం పెడుతున్నారు.

ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో ఇమ్రాన్‌ ప్రభుత్వం, అక్కడి సైన్యం, ఐఎస్ఐ.. ఇలా అన్ని సంస్థలూ భయందోళలో ఉన్నట్లు చెప్తున్నారు. పాకిస్తాన్ చేష్టలపై అమెరికా సెనేట్‌లోని డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు దాదాపు ఒకే అభిప్రాయం ఉండడంతో ఈ బిల్లు సునాయాణంగా ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌తో మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉండడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానితో ఫోన్‌లో కూడా మాట్లాడడానికి జో బైడెన్‌ సిద్ధంగా లేరని తెలుస్తున్నది. సెనేట్‌లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు పేరు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, పర్యవేక్షణ, జవాబుదారీతనం.

ఈ బిల్లును తయారు చేసిన కమిటీకి రిపబ్లికన్ సెనేటర్ జిమ్ రీస్ అధ్యక్షత వహించారు. ఈ బిల్లు తయారీలో పలు పార్లమెంటరీ కమిటీలు సహకరించినట్లు తెలుస్తున్నది. అమెరికా రక్షణ కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి, నిఘా సంస్థలు 180 రోజుల్లో ఈ కమిటీలకు మొత్తం సమాచారం అందించనున్నట్లు సమాచారం. అనంతరం సుదీర్ఘంగా చర్చించిన మీదట చట్టం చేస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆమోదిస్తే ఈ చట్టం అమలులోకి వస్తుంది. ‘

ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఉన్న పలంగా సైన్యాన్ని వెనక్కి రప్పించిన బైడెన్‌ ప్రభుత్వంపై అటు ప్రజల్లో, ఇటు మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీని నుంచి బయటపడేందుకు ఈ బిల్లును తీసుకొచ్చి తాలిబాన్‌ను అణిచివేయాలని బైడెన్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. తాలిబాన్‌తోపాటు పాకిస్తాన్‌కు కూడా గుణపాఠం చెప్పేందుకు వీలుగా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఈ విషయం తెలియగానే పాకిస్తాన్‌ మంత్రి షిరిన్‌ మజారీ అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘20 ఏండ్లపాటు అమెరికా, నాటో దళాలకు వెన్నుదన్నుగా నిలిచాం. ఇప్పుడు ఈ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇక మేం కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, మేం ఎవరికీ లొంగిపోం’ అని అసహనంగా వ్యాఖ్యానించారు. 

ఇలా ఉండగా,   ఈ నెల 7-8 తేదీల్లో పాక్‌ అధికారులతో సమావేశం కావడంకోసం ఆ దేశంలో పర్యటింపనున్న అమెరికా డిప్యూటీ సెక్రటరీ విండీ షెర్మన్‌ తన పర్యటనకు ముందే ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించారు. తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడంపై పాక్‌ ద్వంద ప్రమాణాలు అనుసరిస్తున్నదని అమెరికా ఆరోపణలను చేస్తోంది. ఈ సమయంలో ఆమె పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉగ్రవాద నిరోధకంపై పాక్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని, ఎటువంటి బేధం లేకుండా అన్ని తీవ్రవాద గ్రూపులపై నిరంతర చర్యలు ఆశిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఉగ్రవాదం కారణంగా ఇరు దేశాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయని, అదేవిధంగా అంతర్జాతీయ, ప్రాంతీయ ఉగ్రవాద బెదిరింపులను తొలగించేందుకు సహాయ సహకారాల కోసం ఎదురుచూస్తున్నామని ఆమె పేర్కొన్నారు.