
కాంగ్రెస్ పార్టీలో పూర్తి అయోమయం నెలకొందని, పార్టీలోని అందరూ సిద్దూ కామెడీ ట్రిక్స్లో పడినట్టు కనిపిస్తోందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల మద్దతును కెప్టెన్ కోల్పోయారంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి హరీష్ రావత్, సీనియర్ నేత రణ్దీప్ సింగ్ సూర్జేవాలా చెప్పిన గణాంకాలపై ఎద్దేవా చేశారు.
కనీసం గణాంకాలు చెప్పే విషంలోనైనా నేతల మధ్య సమన్వయం లేదని విమర్శలు గుప్పించారు. పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించలేక అసలు విషయానికి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తనపై ప్రస్తుతం వ్యాప్తి చేస్తున్న అబద్దాల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకత్వానికి ఎమ్మెల్యేలు లేఖ రాసినట్టు చెబుతున్నారనీ, అయితే ఎందరు లేఖ రాసారనే విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో లెక్క చెబుతున్నారని గుర్తు చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా అల్లుతున్న కథేనని, తప్పులతడక వ్యవహారమని కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపియన్చారు.
“43 మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాసినట్టు హరీష్ రావత్ చెబుతున్నారు. 79 మందిలో 78 మంది ఎమ్మెల్యేలు నన్ను (కెప్టెన్ను) తొలగించాలని కోరినట్టు సూర్జేవాలా అంటున్నారు. రేపో మాపో నాకు వ్యతిరేకంగా 117 మంది ఎమ్మెల్యేలు లేఖ రాసారని కూడా వాళ్లు చెప్పొచ్చు” అని అమరీందర్ సింగ్ చమత్కరించారు.
అబద్ధాలు చెప్పే విషయంలోనైనా నాయకుల మధ్య సమన్వయం లేకుండా పోయిందని ఎద్దేవా చేసారు. అసలు విషయం ఏమిటంటే, ఆ లేఖపై సంతకం చేసిన 43-మంది ఎమ్మెల్యేలు ఒత్తిడితో బలవంతంగా చేసారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. “తమ తప్పులను సమర్థించడానికి వారు పచ్చి అబద్ధాలను ఆశ్రయిస్తున్న తీరు చూస్తే బాధగా ఉంది” అని ఆయన తెలిపారు.
2017 నుండి, పంజాబ్లోని ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ తన అధికారంతో కాంగ్రెస్తో విజయం సాధించిందని, ఇది పార్టీ నాయకత్వం చేస్తున్న వాదనలకు పూర్తి విరుద్ధమని అమరీందర్ సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్యంగా 77 సీట్లను గెలుచుకుంది. 2019 లో జరిగిన ఉప ఎన్నికల్లో, శిరోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్ సుఖ్బీర్ బాదల్ యొక్క బలమైన కోట జలాలాబాద్ నుండి కూడా గెలిచిన కాంగ్రెస్ నాలుగు నాలుగు స్థానాలలో మూడు గెలుచుకుంది.
2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా, దేశంలో పెద్ద ఎత్తున బిజెపి ప్రభఞ్జనం ఉన్నప్పటికీ పంజాబ్ లో 13 సీట్లలో ఎనిమిదింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుందని అమరీందర్ గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, ఏడు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో, కాంగ్రెస్ 350 సీట్లలో 281 (80.28%) గెలిచింది, 109 మునిసిపల్ కౌన్సిల్లకు జరిగిన ఎన్నికల్లో, పార్టీ 97 గెలిచిందని వివరించారు.
“స్పష్టంగా, సూర్జేవాలా చెప్పినట్లుగా పంజాబ్ ప్రజలు నాపై నమ్మకాన్ని కోల్పోలేదు,” అని మాజీ సీఎం స్పష్టం చేశారు, ఈ మొత్తం వ్యవహారం పిసిసి చీఫ్ సిద్ధూ ఆదేశాల మేరకు కొంతమంది నాయకుల సృష్టి అని విమర్శించారు.
అకాలీదళ్ అధినేతలు బాదల్ లతో తాను చేతులు కలిపినట్లు కొందరు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారవేస్తూ “బాదల్తో నేను చేతులు కలిపినట్లయితే నేను గత 13 సంవత్సరాలుగా న్యాయస్థానాలలో పోరాడుతూ ఉండలేను,” అని స్పష్టం చేశారు. తాను సాగించిన న్యాయ పోరాటాలలో ఒక్క పార్టీ నేత కూడా తనకు మద్దతుగా నిలవలేదని పేర్కొన్నారు.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు