పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో పాటు పలువురు బిజెపి కార్యకర్తలపై ప్రచారంపై చివరిరోజైన నేడు దాడి జరిగింది. ఈ సందర్భంగా టిఎంసి మద్దతుదారులు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో దిలీప్ ఘోష్ జరుపుతున్న ఇంటింటికీ ప్రచారం మధ్యలో విరమించుకోవలసి వచ్చింది.
దిలీప్ ఘోష్ ను టిఎంసి కార్యకర్తలు “తన్నారు, నెట్టారు, ఎగతాళి చేశారు” అంటూ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు. జాదు బాబర్ బజార్ సమీపంలో రెండు ప్రత్యర్థి గ్రూపుల మధ్య గొడవ జరగడంతో ఒక బిజెపి కార్యకర్త కూడా గాయపడ్డాడు. ఈ నెల 30న పశ్చిమబెంగాల్లోని భవానీపూర్, షంషేర్గంజ్, జాంగీర్పూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
ప్రచారానికి చివరి రోజైన సోమవారం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్కు మద్దతుగా భాబానీపూర్లో దిలీప్ ఘోష్తో సహా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులను బిజెపి మోహరింపచేసింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో టిఎంసి కార్యకర్తలు, మద్దతుదారులు ఘోష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వెనుకకు తిరిగి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా, టిఎంసి కార్యకర్తలు, బిజెపి కార్యకర్తలు , ఘోష్ సెక్యూరిటీ గార్డుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకానొక సమయంలో, ఘోష్ సెక్యూరిటీ గార్డులు జనాలను భయపెట్టడానికి సర్వీస్ రివాల్వర్లను ఝుళిపించడం కనిపించింది. పరిస్థితి అదుపు తప్పడం చూసి ఘోష్ వెనక్కి వెళ్లి తన కార్యకర్తలను తనతో వచ్చేయమని కోరారు.
అయితే, ఘోష్తో పాటు వచ్చిన బిజెపి కార్యకర్త భాబ్ నారాయణ్ సింగ్ను టిఎంసి కార్మికులు పట్టుకుని కొట్టారు. తన తల నుండి రక్తస్రావం కనిపించినప్పటికీ అతను టిఎంసికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నాడు. తరువాత ఘోష్ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ఆ కార్యకర్తను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
“ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు మాకు ఎలాంటి భద్రత లేదని మీరు చూడవచ్చు. వారు మా కార్యకర్త నుదురు విరిచారు. నన్ను కూడా కొట్టారు. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నిక ఎలా జరుగుతుందో నాకు తెలియదు. ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. కానీ ప్రజలు ఎలా ఓట్లు వేస్తారో నాకు తెలియదు” అంటూ జరిగిన సంఘటనపై దిలీప్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు రోజు, బిజెపి ఎంపి అర్జున్ సింగ్ కూడా ప్రచార సమయంలో టిఎంసి మద్దతుదారుల నుండి నిరసనలను ఎదుర్కొన్నారు. ఆయన శంభునాథ్ పండిట్ హాస్పిటల్ సమీపంలో ప్రచారం చేస్తున్నప్పుడు స్థానికులు ఆయనకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్’ నినాదాలు చేశారు.
“పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఆరోగ్యకరమైనది కాదు. భబానీపూర్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది” అంటూ రాష్ట్ర బిజెపి
అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆందోళన వ్యక్తం చేశారు. వారు దిలీప్ ఘోష్ వయస్సును కూడా చూడకుండా అమానుషంగా దాడి చేశారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో హింస సంస్కృతిని టిఎంసి తీసుకువస్తోందని, ఇది బెంగాల్ నిజమైన సంస్కృతికి విరుద్ధమని ఆయన ధ్వజమెత్తారు. “టిఎంసి నాయకులు ఢిల్లీని సందర్శించినప్పుడు, మేము వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయగలం. కానీ అది బిజెపి సంస్కృతి కాదు” అని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై బెంగాల్ బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పౌల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతాబెనర్జి అసహనంతో ఊగిపోతున్నారని, వాళ్లు తమను కనీసం ప్రచారం చేసుకోవడానికి కూడా అనుమతించడం లేదని ఆరోపించారు. టీఎంసీ గూండాలు తరచూ తమ కార్యకర్తలను హింసిస్తున్నారని, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఓటర్లు వీటిని గమనించి ఈ నెల 30న ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలని అగ్నిమిత్ర పౌల్ సూచించారు.
More Stories
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభం
రాజ్యాంగబద్ధ పాలనకై పోరాడిన పార్టీపైనా దుష్ప్రచారం!?
పత్తాలేని బిఆర్ఎస్…కాంగ్రెస్కు ఓటమి ఖాయం