యుపిలో రెండు పార్టీలతో బిజెపి పొత్తు

మరోసారి ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు పార్టీలతో పొట్టుపెట్టుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. గతంలో మాదిరిగానే నిషాద్‌ పార్టీ, అప్నాదళ్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆ పార్టీ ఎన్నికల ఇంఛార్జీ, కేంద్ర మంత్రి  ధరేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. 

ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వం అధికారికంగా ప్రకటించనున్నదని ఆయన తెలిపారు. అప్నాదళ్, నిషద్ పార్టీలతో కుదిరిన ఎన్నికల ఒప్పందంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరింత బలం పుంజుకోనుందని  కేంద్ర మంత్రి భరోసా వ్యక్తం చేశారు.

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం జరిగిందని, తాను యూపీలో పర్యటించి ప్రజలను కలుసుకున్నానని, గతంలో కన్నా ఎక్కువ సీట్లలో బీజేపీని ప్రజలు గెలిపిస్తారనే బలమైన నమ్మకం తనకు ఉందని ధర్మేంద్ర ప్రధాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బిజెపి పోరాడుతుందని ఆయన చెప్పారు.

నిషాద్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ నిషాద్‌తో సమావేశమైన బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం సీట్ల భాగస్వామ్యానికి సంబంధించి చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఆ రెండు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాలను ధర్మేంద్ర ప్రధాన్‌ మీడియాకు వెల్లడించారు. 2019 పార్లమెంటరీ ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలు కలసి పోటీచేశాయి. సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకున్నామని, సరైన సమయంలో దీనిపై ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. 

పలు పార్టీలు తమతో కలిసి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, అయితే, నిషాద్‌ పార్టీ, అప్నాదళ్‌తో తమ బంధం కొనసాగుతుందని చెప్పారు. నిషాద్‌ పార్టీతో అవగాహన కారణంగా ఉత్తరప్రదేశ్‌లో నిషాద్‌ కమ్యూనిటీ ఓటర్లు బీజేపీకి మద్దతు ఇస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

 నిషాద్‌ పార్టీ 10 కంటే ఎక్కువ సీట్లను ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది. తాము గౌరవప్రదమైన సీట్లను ఆశిస్తున్నామని, అయితే, 14 వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్రం, రాష్ట్రప్రభుత్వం హామీ ఇవ్వడమే తమకు ముఖ్యమని నిషాద్‌ పార్టీ అధినేత డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ నిషాద్‌ తెలిపారు.

కాగా, మ‌హ‌రాజ్‌గంజ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ యోగి ఆదిత్యానాధ్ పేరు చెబితేనే నేర‌స్తులు వ‌ణికిపోతున్నార‌ని పేర్కొన్నారు. యోగి నిజాయితీపై ఎవ‌రికీ సందేహాలు లేవ‌ని చెప్పుకొచ్చారు. యోగి ఆధ్యాత్మిక గురువు అవైద్య‌నాధ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌భ‌లో రాజ్‌నాధ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు

ఇలాఉండగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో బీజేపీ కోర్‌ కమిటీ సమవేశం జరిగింది. యోగి ఆదిత్యనాథ్‌తోపాటు రాష్ట్ర ఇంఛార్జీ రాధా మోహన్‌సింగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జీ ధర్మేంద్ర ప్రధాన్‌, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, డాక్టర్‌ దినేశ్‌ శర్మ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సునీల్‌ బన్సల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నిలక ప్రచారం, కార్యక్రమాలతో పాటు నిషాద్ పార్టీతో ఎన్నికల అవగాహనపై చర్చించినట్లు తెలుస్తున్నది.