కేజీ నుంచీ పీజీ వరకూ ఉచిత విద్య ఎక్కడ దొర!

తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించి గద్దెనెక్కిన దొర  ఈ ఏడేండ్ల కాలంలో ఎక్కడా అమలు చేయలేదేమిటని బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో గురుకులాలు నెలకొల్పి విద్యనందిస్తున్నాం.. ప్రతి పిల్లవాని మీద ఏటా రూ 1.32 లక్షలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం గప్పాలు చెబుతుందని ఆమె ఎద్దేవా చేశారు.

అయితే గురుకులాల ద్వారా విద్య కొంత మంది విద్యార్థులకే అందుతోందని అంటూ మరి గ్రామాలలోని మిగతా వారి పరిస్థితి ఏంటి? అని ఆమె నిలదీశారు. 1,000 గురుకులాల్లో 5వ తరగతి నుంచి 12 వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 4 లక్షలకు మించరని ఆమె స్పష్టం చేశారు.  సీఎం కేసీఆర్ చదువుకున్న దుబ్బాక బడి, మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట స్కూల్, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల సర్కారు బడులు ఉన్నట్లే రాష్ట్రంలో అన్ని బడులు ఎందుకు ఉండకూడదో వారే చెప్పాలని ఆమె కేసీఆర్ ను ప్రశ్నించారు.

రాష్ట్రంలోని మిగతా 6,000 హైస్కూల్స్, 20 వేల ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఆ స్థాయి సౌకర్యాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేవలం కుటుంబ పాలనతో వారి వారి ప్రాతినిధ్యం వహిస్తున్న వాటికి ప్రాధాన్యతనిస్తున్న దొర కుటుంబం యావత్ తెలంగాణ ప్రజలను మరిచారన్నది పచ్చి నిజం అని విజయశాంతి స్పష్టం చేశారు.

కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధాన పాలసీని పక్క రాష్ట్రం ఏపీలో అమలు చేస్తున్నా..ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ధ్వజమెత్తారు. అంగన్వాడీలను సర్కారు బడులకు అనుసంధానం చేసి కేజీ తరగతుల ప్రారంభం గురించి ఇప్పటి వరకు ప్రణాళికలే సిద్ధం చేయకపోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 26 వేల పైగా బడుల్లో విద్యార్థులు లేని వాటిని మూసివేయడానికి ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించిందని ఆమె విమర్శించారు. 

దాదాపు 2 వేల బడులకు సౌలతులు కల్పించకుండా మూసివేసి పది వేల మంది టీచర్లు అదనంగా ఉన్నారని లెక్కలు వేస్తుంది. విద్య అనేది పెట్టుబడి పెట్టినా.. రాబడి లేనిదిగా భావించి. రాబడి వచ్చే మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టి  భారీగా ఆదాయాన్ని పొందుతుందని ఆమె విమర్శించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 500 పైగా ఎంఈవో పోస్టులు, 1,800 హైస్కూల్ హెచ్ఎం, 2,000 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వేలకొద్దీ ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే అన్ని స్థాయిలో నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తే అదనపు పోస్టులు భర్తీ చేయవచ్చని ఆమె చెప్పారు. కానీ ప్రభుత్వం పదవి విరమణ వయసు పెంచి.. ఉన్న నిరుద్యోగులకు నిరాశను మిగుల్చుతుందని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసిస్టెన్స్ ప్రొఫెసర్ వంటి పోస్టులు భర్తీ చేయకుండా ఉన్నత విద్యను నిరుపేదలకు విద్యను దూరం చేస్తుందని ఆమె విమర్శించారు.