ఆఫ్ఘన్ లో తిరిగి  క్రూరంగా చంపడం, కాళ్లు, చేతులు నరకడం 

తాలిబ‌న్లు అంటేనే క్రూర‌త్వం గుర్తుకువ‌స్తుంది. అయితే అలాంటి రోజులు మ‌ళ్లీ ఆఫ్ఘ‌నిస్తాన్‌లో క‌నిపించ‌నున్నాయి. ఇటీవ‌ల ఆ దేశాన్ని మ‌ళ్లీ హ‌స్తగ‌తం చేసుకున్న తాలిబ‌న్లు తాజాగా  ఇస్లామిక్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఆఫ్ఘనిస్థాన్  స్పష్టం చేశారు. ఉరితీతలు, చేతులు నరకడాలు వంటి శిక్షలను పునరుద్ధరిస్తామని తెలిపారు. 
 
అయితే ఇటువంటి శిక్షలను బహిరంగంగా అమలుపరచాలా? వద్దా? అనే అంశంపై అధ్యయనం జరుగుతోందని చెప్పారు. అతి కిరాత‌కంగా చంపివేయ‌డం, కాళ్లు, చేతుల్ని న‌రికివేయ‌డం లాంటి శిక్ష‌ల‌ను మ‌ళ్లీ అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్రిజ‌న్స్ ఇంచార్జీ నేత ముల్లా నూరుద్దిన్ తురాబి ప్రకటించారు.
 
1990 ద‌శ‌కంలో ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఏలిన రోజుల్లో ఇలాంటి శిక్ష‌ల‌నే అమ‌లు చేసేవారు. ఈ ఏడాది ఆగ‌స్టు 15వ తేదీన ఆఫ్ఘ‌నిస్తాన్ తిరిగి చేజిక్కించుకున్న తాలిబ‌న్లు మెల్ల‌మెల్ల‌గా త‌మ స్ట‌యిల్ పాల‌న‌ను అమ‌లులోకి తీసుకువ‌స్తున్నారు.
 
ఆఫ్ఘనిస్థాన్ నూతన పాలకుల పాలనలో జోక్యం చేసుకోరాదని ప్రపంచాన్ని టురబి హెచ్చరించారు. గత తాలిబన్ పాలనలో ఉరితీతలపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలను తోసిపుచ్చారు. స్టేడియంలలో తాము అమలు చేసిన శిక్షల గురించి ప్రతి ఒక్కరూ విమర్శించారని, కానీ తాము ఎన్నడూ వారి చట్టాలు, శిక్షల గురించి ఏమీ మాట్లాడలేదని గుర్తు చేశారు. 
 
‘‘మా చట్టాలు ఎలా ఉండాలో ఎవరూ చెప్పకూడదు. మేము ఇస్లాంను అనుసరిస్తాం. ఖురాన్ ఆధారంగా మేం చట్టాలు చేస్తాం’’ అని తేల్చి చెప్పారు.  న్యాయమూర్తులు కేసులపై విచారణ జరిపి తీర్పులిస్తారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ చట్టాలకు పునాది ఖురాన్ అని స్పష్టం చేశారు.  చేతులను నరకడం భద్రత కోసం చాలా అవసరమని చెప్పారు. ఇది నిరోధక చర్య అని చెప్పారు.
 
తాలిబన్లు 1996-2001 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్థాన్‌ను పరిపాలించినపుడు కాబూల్ స్పోర్ట్స్ స్టేడియంలో లేదా ఈద్గా మసీదు మైదానంలో శిక్షలను అమలు చేసేవారు. వందలాది మంది చూస్తుండగా శిక్షలు అమలయ్యేవి. బాధితుల కుటుంబ సభ్యులు దోషి తలలోకి కాల్చి చంపడం వంటి పద్ధతులను అనుసరించేవారు. ఒక్కొక్కసారి బాధితుల కుటుంబ సభ్యులు ‘‘బ్లడ్ మనీ’’ తీసుకుని, దోషిని సజీవంగా వదిలిపెట్టే అవకాశం ఉండేది. 
 
దొంగలకు చేతులను నరికేవారు. హైవేలపై దోపిడీకి పాల్పడినవారి చేతిని, కాలిని నరికేవారు. అయితే విచారణలు, దోషిత్వ నిర్థరణలు బహిరంగంగా జరగడం అరుదు. న్యాయ వ్యవస్థ పూర్తిగా ఇస్లామిక్ మత పెద్దలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మత పెద్దలకు న్యాయశాస్త్రంలో నైపుణ్యం ఉండదు.
మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా మాన‌వ‌హ‌క్కుల ఉల్లంఘ‌న‌లు జ‌రుగుతున్నట్లు వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. హీర‌త్ న‌గ‌రంలో హై ప్రొఫైల్ మ‌హిళ‌ల‌ను తాలిబ‌న్లు అడ్డుకుంటున్నారు. ఇంటి బ‌య‌ట తిర‌గ‌కుండా.. డ్రెస్సు కోడ్‌పై ఆంక్ష‌లు విధిస్తున్నారు. హ‌జారాలోని మైనార్టీపై అఘాయిత్యానికి పాల్ప‌డిన 9 మందిని చంపిన ఘ‌ట‌న‌లో తాలిబ‌న్ల‌పై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్  ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.