యుపి పరిపాలనలో అసాధారణమైన మార్పు 

ఉత్తర ప్రదేశ్ లో నాలుగున్నరేళ్ల పరిపాలనలో అసాధారణమైన మార్పు తీసుకు రాగలిగామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. తన పాలనకు సంబంధించిన `రిపోర్ట్ కార్డు’ను విడుదల చేస్తూ మొదటిసారిగా 2017 నుండి అల్లర్లు లేకుండా రాష్ట్రం పూర్తిగా రూపాంతరం చెందిందని గుర్తు చేశారు.

ఇప్పుడు అర్హులైన వారికి ప్రభుత్వ పధకాలు చేరుతున్నాయని, వ్యాపారం సులభతరం చేయడంలో రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. 2017లో లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్రంలో పేర్కొన్న ప్రతి హామీని బిజెపి ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు.  బీజేపీ పాల‌న‌పై యూపీ ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెరిగింద‌న్నారు. త‌మ ప‌నితీరే బీజేపీని గెలిపిస్తుంద‌ని విశ్వాసం వ్యక్తం చేశారు. 

2022 ప్రారంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 403 సభ్యుల శాసన సభలో పార్టీ మొత్తం 350 సీట్లను మించి గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వారు తమ ఇళ్లను నిర్మించడంలో బిజీగా ఉన్నారని,  బదిలీలు – పోస్టింగ్‌ల కోసం అవినీతిలో కూరుకు పోయారని అంటూ గతంలో అధికారంలో ఉన్న బీఎస్పీ, ఎస్పీ పార్టీల పాలనను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. 

అయితే రాష్ట్రం వారి పాలనలో అభివృద్ధిలో వెనుకబడి ఉందని,  తరచూ అల్లర్లకు గురవుతూ ఉండేదని అంటూ ముఖ్యమంత్రి విపక్షాలపై విరుచుకుపడ్డారు. పీఎం ఆవాస్ యోజన లేదా ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం వంటి 44 కేంద్ర పథకాలను అమలు చేయడంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 

అభివృద్ధి, శాంతిభద్రతలు, కరోనా మహమ్మారి కట్టడి వంటి విషయాలలో తమ ప్రభుత్వం సమర్ధవంతంగా, పారదర్శకంగా పనిచేస్తూ ఉండడంతో గతంలో అల్లర్ల కారణంగా మసకబారుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పూర్తిగా ఇనుమడింప చేశామని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. 

“వారిలా కాకుండా (గత ప్రభుత్వాలు), మేము మా కోసం విలాసవంతమైన గృహాలను నిర్మించుకోలేదు. మా ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టి 44 లక్షల గృహాలు వారికి నిర్మించింది” అని ఆయన తనకన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్‌పై విసుర్లు విసిరారు. 

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని అందించడానికి నేరస్థుల పట్ల వారి కుల, మతాలతో సంబంధం లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. “గతంలో వలే ప్రతి 3-4 రోజులకు మత ఘర్షణలు జరగడం కాకుండా, నాలుగున్నర సంవత్సరాల కాలంలో యుపి ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నది” అని పేర్కొన్నారు. 

2017లో తాము అధికారంలోకి వ‌చ్చాక యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు గ‌ణ‌నీయంగా మెరుగుప‌డ్డాయ‌ని యోగి పేర్కొన్నారు. 2017 కంటే ముందు యూపీలో నేర‌స్తుల‌, మాఫియా ఆగ‌డాలు అధికంగా ఉండేవి. భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్నిసృష్టించారు. అవినీతికి అడ్డాగా మారిపోయింది. రెండు, మూడు రోజుల‌కొక సారి అల్ల‌ర్లు జ‌రిగేవి. తాను సీఎం అయ్యాక నేర‌స్తుల‌ను ఉక్కుపాదంతో అణిచివేశాం. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడామ‌ని యోగి స్ప‌ష్టం చేశారు. ప్రతి స్థాయిలో ప్రభుత్వం సున్నితత్వాన్ని తమ ప్రభుత్వం ప్రదర్శిస్తుందని చెబుతూ కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పరీక్షలు చేస్తూ, టీకాలు వేస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతోందని, వ్యాపారాన్ని సులభతరం చేసే విషయంలో దేశంలో యుపి నంబర్ 2 గా అవతరించిందని ఆయన తెలిపారు. ఇంతకుముందు, అధికారులను కార్డుల ప్యాక్ వలే మార్చుతుండేవారని, కానీ గత నాలుగున్నర సంవత్సరాలలో, పోస్టింగ్ కోసం డబ్బు మార్పిడి చేసినట్లు ఎవరూ ఆరోపణలు చేయలేక పోతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా యుపి ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేసిన ‘వికాస్ కీ లహర్, హర్ గావ్ హర్ షహర్’ అనే బుక్లెట్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.