ఎన్‌హెచ్‌ఏఐని ఆదాయాన్ని ఉత్పత్తి చేసే “బంగారు గని”

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌హెచ్‌ఏఐని ఆదాయాన్ని ఉత్పత్తి చేసే “బంగారు గని”గా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రస్తుత స్థాయి రూ 40,000 కోట్ల నుంచి రాబోయే ఐదేళ్లలో రూ 1,40,000 లక్షల కోట్ల వార్షిక టోల్ ఆదాయాన్ని వసూలు చేస్తుందని చెప్పారు. 
 
ఎన్‌హెచ్‌ఏఐ ఎక్కువ రుణభారంతో సతమతం అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నోడల్ ఏజెన్సీకి ‘ఏఏఏ’ రేటింగ్ లభించిందని, ‘ఏఏఏ’ అనేది అత్యధిక క్రెడిట్ రేటింగ్ బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 
 
2017 మార్చిలో రూ  74,742 కోట్ల ఉన్న మొత్తం రుణాలు ఈ ఏడాది మార్చి చివరినాటికి రూ  3,06,704 కోట్లకు పెరిగాయని ఇటీవల మంత్రి రాజ్యసభకు తెలియజేశారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు ఉపాధిని సృష్టిస్తాయని, దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని గడ్కరీ తెలిపారు.
 
2019లో ప్రారంభమైన ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే పనులు 2023, మార్చి నాటికి పూర్తి కానునట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభమైన(2023) నాటి నుంచి కేంద్రానికి ప్రతి నెలా రూ 1,000 నుంచి రూ 1500 కోట్ల విలువైన టోల్ ఆదాయం వస్తుందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల గుండా వెళ్లే ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పురోగతిని తెలుసుకోవడానికి గడ్కరీ సుడిగాలి పర్యటన చేశారు.

జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయితో పోటీ పడే విధంగా తయారు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే  మార్చి 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ‘భారత్ మాల పరియోజన’ మొదటి దశలో భాగంగా నిర్మిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల గుండా వెళ్లే ఎనిమిది లైన్ల ఎక్స్ ప్రెస్ వే. ఈ హైవే ప్రారంభమైన తర్వాత దేశ రాజధాని, దేశ ఆర్థిక కేంద్రం మధ్య ప్రయాణ సమయం దాదాపు 24 గంటల నుండి 12 గంటలకు తగ్గనుంది.

పేదలకు ఎయిర్‌బ్యాగ్స్‌ ఉండవే 
కాగా, ధనవంతుల కార్లలో 8 ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నప్పుడు, పేదల కార్లకు ఎందుకు ఉండవని నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. చిన్నకార్లను కొనేవారు ఎక్కువగా పేదలు, మధ్యతరగతి వారే ఉంటున్నందున, వారికి కూడా భద్రత కల్పించేలా చిన్న కార్లలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండేలా ఆటోమొబైట్‌ కంపెనీలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

2021 ఏప్రిల్ 1 నుంచి అన్ని కొత్త కార్లలో 2 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు రోడ్డు భద్రతపై కమిటీ సూచన మేరకు మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.

‘చిన్న కార్లను ఎక్కువగా దిగువ, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తారు. వారి కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లు లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు వారు చనిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో కార్ల తయారీదారులందరూ తమ అన్ని రకాల కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించమని విజ్ఞప్తి చేస్తాను’ అని చెప్పారు. ఎయిర్‌బ్యాగ్స్‌ సంఖ్య పెంచడం వల్ల కారు ధర రూ.3,000-4,000 వరకు పెరిగినప్పటికీ.. వారికి కూడా పూర్తి రక్షణ లభిస్తుంది కదా అని పేర్కొన్నారు.