బసవతారకం ఆస్పత్రిలో డిజిటల్ రేడియో గ్రఫీ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే అత్యాధునికమైన 3డి – డిజిటల్ మమ్మోగ్రామ్ ఉందని, ఈ రోజు మనం మన ఆసుపత్రిలో డిజిటల్ రేడియో గ్రఫీని ఆసుపత్రి చైర్మన్  నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. దీనితో  ఆసుపత్రి కిరీటంలో మరొక మణిపూస వచ్చి చేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
 
ఈ డిజిటల్ రేడియో గ్రఫీ ద్వారా మనం సాధారణంగా ఫిల్మ్ పైన తీసే ఎక్సరేని డిజిటల్ రూపంలో వెంటనే చూసే వీలుంటుందని, ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ద్వారా తీసే ఇమేజ్ మంచి క్వాలిటీతో ఉండి ఖచ్చితమైన నిర్దారణ చేసేందుకు వీలుంటుందని బాలకృష్ణ తెలిపారు. దీని ద్వారా కేవలం 8 గంటల సమయంలో 200కి పైగా ఇమేజెస్ తీయవచ్చని, తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మందికి సేవలు అందించేందుకు వీలవుతుందని ప్రశంసించారు.
 
దీని ద్వారా రోగులు అతి తక్కువ రేడియేషన్ కి గురి అవుతారని, ఈ విధానం వల్ల మనం పర్యావరణానికి కూడా మేలు చేసినవాళ్ళమవుతామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అత్యాధునిక సాంకేతికత సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనేదే నాన్న ఎన్టీఆర్ ఆశయమని తెలిపారు.
అత్యాధునిక సాంకేతికతతో అత్యంత నిపుణులైన డాక్టర్లచే అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఉండాలనేదే ఈ ఆసుపత్రి ఆశయమని స్పష్టం చేశారు. ప్రతి రోజు ఎన్నో వందలమంది రోగులకు వారి ఆర్ధిక పరిస్థితితో సంబంధం లేకుండా ఈ ఆసుపత్రిలో చికిత్స చేయడం జరుగుతుందని బాలకృష్ణ తెలిపారు.