రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం

తెలంగాణలో సంచలనం రేపిన సైదాబాద్ ఘటన కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య ఘటనపై జ్యుడీషియల్ విచారణకు రాష్ట్ర  హైకోర్టు ఆదేశించింది. రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని దాఖలైన లంచ్ మోషన్ పిల్ ​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్ కు హైకోర్టు ఆదేశించింది.

వరంగల్ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వాదనల సందర్భంగా రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ అన్నారు. అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్ తెలిపారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ వీడియా చిత్రీకరణ జరిగిందని చెప్పారు. పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ జరిగినట్లు వివరించారు. వీడియోలు రేపు రాత్రి 8 లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.

కాగా, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నిందితుడు రాజు గురువారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత రాజు పరారీలో ఉన్నాడు. రాజు కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టడం సహా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

మరోవైపు పోలీసులే  రాజు ఆత్మహత్యపై అతడి తల్లి, భార్య కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను పోలీసులే చంపారని.. చంపి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజు భార్య మౌనిక ఆరోపించారు.  రాజు దొరికాడని, అతణ్ని ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పుకోవడం తాము విన్నామని మౌనిక తెలిపింది.    అయితే, రాజుది ఆత్మహత్యే అని తెలంగాణ డీపీజీ మహేందర్ రెడ్డి  స్పష్టం చేశారు.