భారతదేశ సంస్కృతికి ఆధ్యాత్మికతే మూలం 

భారతదేశ సంస్కృతికి మన ఆధ్యాత్మికతే మూలమన్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు  మన ఆధ్యాత్మికతతో ప్రపంచానికి వెలుగులు పంచేందుకు శ్రీ అరవిందుల వారు విశేషమైన కృషిచేశారని తెలిపారు. ప్రస్తుత ప్రపంచానికి ఆధ్యాత్మిక చేతన ఎంతో అవసరమని, ఇందుకోసం శ్రీ అరవిందులవారి స్ఫూర్తితో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. 
 
శ్రీ అరబిందో 150వ జయంత్యుత్సవాల ప్రారంభ సూచకంగా హైదరాబాద్‌లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తూ  భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని చెప్పారు.  ఈ ఆదర్శాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ భారతదేశ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా, గౌరవప్రదంగా చేయడంలో దేశ యువత ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని సూచించారు. మన దైనందిన జీవితంలోనూ ఆధ్యాత్మికత ఎంతో ప్రశాంతతను ఇస్తుందని చెప్పారు. 
భారతగడ్డపై పుట్టిన యువతలో సహజంగానే అపారలమైన శక్తిసామర్థ్యాలున్నాయని,వాటిని గుర్తించి, ఆ సామర్థ్యానికి సరైన పదునుపెట్టి, స్వతంత్ర ఆలోచనలతో పురోగతి సాధించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. పాశ్చాత్య పద్ధతులను అనుసరించేకంటే మనవైన ఆలోచనలతో ముందుకెళ్లడమే మన అస్తిత్వాన్ని ఘనంగా ప్రపంచానికి చాటిచెబుతుందన్నారు. ఈ దిశగా యువత ఆలోచన చేయాలని తెలిపారు.

ఘనమైన భారతదేశ చరిత్రను పునర్లిఖించాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. మన విలువైన సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచం స్వాగతిస్తోందని, అది మనకు గర్వకారణమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆ గౌరవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడాన్ని కూడా యువత బాధ్యతగా తీసుకెళ్లాలని చెప్పారు. 

శ్రీ అరవిందుల వారు గొప్ప యోగి, తత్వవేత్త, కవి, స్వాతంత్య్ర  సమరయోధుడిగా మనకెంతో స్ఫూర్తిని పంచారన్న ఉపరాష్ట్రపతి, తన రచనల ద్వారా మనలో సంపూర్ణ స్వాతంత్య్ర భావనను మనలో రగిలించడంతోపాటు, ఆధ్యాత్మిక భావనను జాగృతం చేయడం ద్వారా మనలో నిరంతరం కొత్తశక్తిని సృష్టించుకునేందుకు మార్గదర్శనం చేశారని గుర్తుచేశారు.

1947లో భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతజాతిని ఉద్దేశించిన శ్రీ అరవిందులవారు ఇచ్చిన సందేశాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, మానవ నాగరికత అభివృద్ధిలో ఆసియా ప్రాంతం కీలకపాత్ర పోషించాలని, స్వయం సమృద్ధితో సమైక్య భారతదేశం, ఆసియా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలంటూ అభిలషించిన విషయాన్ని గుర్తుచేశారు. 
 
వ్యక్తిగతంగా, సామాజికంగా, దేశంగా మనమంతా ఐకమత్యంతో, జాతీయవాదంతో, ఆధ్యాత్మిక భావనతో ముందుకెళ్లడమే ఇందుకు సాధనమన్న శ్రీ అరవిందుల వారి మాటలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.  నేడు విశ్వమానవాళి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శ్రీ అరవిందులవారు సూచించినట్లుగా ఆధ్యాత్మిక చేతన, సచేతనత్వమే సరైన మార్గదర్శనం చేస్తుందని స్పష్టం చేశారు.
 నేత్రదానం ఉత్తమమైన దానాల్లో ఒకటి
 
నేత్రదానం ఉత్తమమైన దానాల్లో ఒకటని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు తావులేకుండా ముందుకురావాలని ఉపరాష్ట్రపతి సూచించారు. కర్ణాటక రాష్ట్రం పావగడలో ఉన్న శ్రీ రామకృష్ణ సేవాశ్రమ్, రజతోత్సవాలు, శ్రీ శారదాదేవి కంటి ఆసుపత్రి, పరిశోధనా కేంద్రంలోని నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంతర్జాల వేదిక ద్వారా ప్రసంగిస్తూ నివారించుకోదగిన (అవైడబుల్) అంధత్వాన్ని నివారించుకోవడంపై దృష్టిసారించాలని సూచించారు. 
 
ఇందుకోసం కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు, తక్కువ ఖర్చుకే కంటివైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అంతర్జాతీయ స్ధాయి వైద్యవసతులను తీసుకురావడం తక్షణావసరమని చెప్పారు. జాతీయ అంధత్వ, దృష్టిలోప సర్వే 2019 ప్రకారం కార్నియా అంధత్వం కారణంగా బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది 50 ఏళ్ల లోపు వారేనని ఆయన తెలిపారు.