దేశ రాజధాని ఢిల్లీలో గత 19 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి వర్షపాతం బుధవారం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఐఎండి కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ను ప్రకటించింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 112.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోంది.
భారీ వర్షాల కారణంగా రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనదారులను పక్క దారికి మళ్లించారు. మరోవైపు వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు.
ఇక 17 నెలల తర్వాత నగరంలో పాఠశాలలు పున: ప్రారంభమైన రోజునే భారీ వర్షాలు కురవడంతో… విద్యార్థులు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వరదలను దాటుకుంటూ స్కూల్స్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల ఆగస్టులో దేశం మొత్తం మీద సాధారణ వర్షపాతం కంటే 24 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే ఈ నెల సెప్టెంబరులో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది.
ఢిల్లీలో బుధవారం ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ సబ్ వే, ప్రతాప్ నగర్ ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచింది. వరదనీటి ప్రవాహంతో జఖీరియా అండర్ పాస్ ను మూసివేశారు. ఢిల్లీ-ఆగ్రా రైలుమార్గంలో వరదనీటి ప్రవాహంతో కల్వర్టు కొట్టుకుపోయి 20 అడుగుల లోతు గుంత ఏర్పడింది. దీంతో ఢిల్లీ-ఆగ్రా మార్గంలోని 15 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.
ఢిల్లీ, ఎన్సీఆర్, గురుగ్రామ్, మానేసర్, ఫరీదాబాద్, బల్లభ్ గడ్, తోషం, భివానీ, జాజ్జార్, నార్నౌల్, మహేంద్రఘడ్, కోసాలి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ ట్వీట్ చేసింది. ఈ నెల 4వతేదీ వరకు ఢిల్లీలో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.
కాగా, ఢిల్లీలో ఆగస్టు 30 వరకు 144.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెలలో నమోదయ్యే సాధారణ వర్షపాతం 209.4 మి.మీ కన్నా 31 శాతం తక్కువ నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక భారత వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజరు మెహపాత్రా మాట్లాడుతూ.. సెప్టెంబర్లో మధ్య భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కన్నా.. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం రుతుపవనాల లోటు 9 శాతంగా ఉంది. సెప్టెంబర్లో కురవబోయే వర్షాల వల్ల రుతుపవనాల లోటు కూడా తగ్గే అవకాశంముందని ఆయన అంటున్నారు. అలాగే ఈ నెలలో ఉత్తర, ఈశాన్య భారతదేశం, దక్షిణ భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాపాతం నమోదవ్వనున్నట్లు మెహపాత్రా తెలిపారు.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా