కేసులు పెరిగినా.. ‘థర్డ్‌వేవ్‌’కు అవకాశాలు తక్కువే

రాబోయే నెలల్లో కొవిడ్‌ కేసులు కాస్త పెరిగే అవకాశం ఉందని, అయితే థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు.  ప్రజలు కొవిడ్‌ నుంచి రక్షణ పొందేందుకు టీకాలు వేసుకుంటున్నారని తెలిపారు. 

వైరస్‌ సోకినా తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అయితే, ప్రజలు కొవిడ్‌ నియమాలను ఎంత మేరకు ఖచ్చితంగా పాటిస్తారనే విషయంపైనే కొవిడ్‌ ప్రవర్తన ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

‘థర్డ్‌ వేవ్‌లో చిన్నారులపై ప్రభావం’పై ఆయనను ప్రశ్నించగా  టీకాలు వేయకపోవడంతో చాలా మందికి ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం ఉందని నమ్ముతున్నట్లుతెలిపారు. అయినా పిల్లలు కరోనా బారినపడినా తేలికపాటి లక్షణాలుంటాయని, తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ ఉండదని ప్రపంచ డేటా చూపిస్తోందని పేర్కొన్నారు. 

దేశంలో ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో 55-60 శాతం మంది పిల్లల్లో ఇప్పటికే యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారని వెల్లడించారు. అయితే పాఠశాలల పునః ప్రారంభంపై స్పందిస్తూ  వైరస్‌ సానుకూలత రేటు తక్కువ ఉన్న ప్రాంతాలు, కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తున్న ప్రాంతాల్లో తిరిగి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించవచ్చని సూచించారు. 

కఠిన పర్యవేక్షణ ఉండాలని, కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమైతే వెంటనే వాటిని మూసివేయాలని స్పష్టం చేశారు. కేసులు తక్కువగా ఉన్న సమయంలో పాఠశాలలు తెరవడంతో ‘రిస్క్‌-బెనిఫిట్‌అనాలిసిస్‌’పై అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. విద్యార్థులకు భౌతిక తరగతులు చాలా ముఖ్యమైనవని హెచ్చరించారు.