భారత్‌లో యాహూ న్యూస్‌ ఆపరేషన్స్‌ నిలిపివేత

వెబ్‌ సర్వీసుల ప్రొవైడర్‌ యాహూ సంస్థ భారత్‌లో న్యూస్‌ ఆపరేషన్స్‌ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు గురువారంతో నిలిపివేస్తున్నట్లు యాహూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అయితే మెయిల్‌ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆ ప్రకటనలో పేర్కొంది. 
 
గతంలో ఇంటర్నెట్‌కి పర్యాయపదంగా నిలిచిన యాహూను.. అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్‌ 2017లో కొనుగోలు చేసింది.  యాహూ గురువారం నుండి ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్‌ చేయదని ప్రకటించింది. ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్‌, యాహూ క్రికెట్‌, ఫైనాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్‌ నిలిచిపోనుంది. 
 
ఎఫ్‌డీఐ కొత్త రూల్స్‌.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్‌ కంటెంట్‌, ముఖ్యంగా యాహూ క్రికెట్‌పై డిజిటల్‌ రూల్స్‌ ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 
 
అయితే యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్‌, సెర్చ్‌ అనుభవాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. వినియోగదారులు తమ ఖాతాల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని యాహూ ఇండియా హౌం పేజీలో ప్రకటించింది. కాగా, డిజిటల్‌ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్‌ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది.