ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ

ఎయిడెడ్ కళాశాలల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ప్రైవేట్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు నిలిపివేస్తూ ఎపి విద్యాశాఖ జారీ చేసిన ఆర్డినెన్స్‌, జిఒలపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల విద్యాశాఖ జారీ చేసిన ఆర్డినెన్స్‌ 12తో పాటు రెండు జిఒలను సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. 
 
 అయితే తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై న్యాయవాది నర్రా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చిందని చదివి వినిపించారు. 
 
అడ్మిషన్లు జరగకపోతే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల స్వాధీనం నోటిఫికేషన్‌పై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. 
 
ఈ అంశంపై పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. 
పూర్తి విచారణ చేపట్టే వరకు విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రవేశాల ప్రక్రియ కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.