నిరుద్యోగ భృతి హామీని సారు ఏనాడో మర్చిపోయారు!

‘‘తెలంగాణలో వేలాది ప్రభుత్వ కొలువుల భర్తీ  అంటూ ఉపఎన్నికలప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఊదరగొడుతున్న సీఎం కేసీఆర్ గారి మాటల్ని ఒక్క నిరుద్యోగి కూడా నమ్మడం  లేదని బిజెపి నేత విజయశాంతి విమర్శించారు. హైదరాబాదులోని ఆయన అధికార నివాసం ప్రగతి భవన్‌పై జరిగిన నిరుద్యోగ జేఏసీ ముట్టడి కార్యక్రమమే అందుకు పెద్ద ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. 

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి హామీని సారు ఏనాడో మర్చిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. రాష్టవ్యాప్తంగా సుమారుగా లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే… భర్తీ చేస్తామని చెప్పిన 50 వేల ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ వెలువడక పోవడాన్ని నిరుద్యోగ జేఏసీ నిలదీసిందని ఆమె గుర్తు చేశారు. 

నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ ఫీజుల రూపంలో వసూలయ్యే సొమ్ముతోనే టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి జీతాలందుతుంటే ఇప్పటికే వయోపరిమితి దాటిపోతున్న ఎందరో నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల కోసం చూసీ చూసీ విసిగి వేసారి ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

టీఎస్‌పీఎస్సీ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారని విజయశాంతి చెప్పారు. 33 జిల్లాలతో కొత్త జోన్ల ఏర్పాటుపై జీవో కూడా జారీ అయినప్పటికీ నోటిఫికేషన్ల విడుదల ఏళ్ళకేళ్ళు ఆలస్యం అవుతున్న కొద్దీ వయోపరిమితి దాటుతున్న వారి సంఖ్య వేలల్లో పెరిగిపోతోందని ఆమె తెలిపారు. 

వీరిలో 25 ఏళ్ళు దాటినవారు పోలీస్ శాఖలో ఉద్యోగాలు కోల్పోయినట్టే.. 40 ఏళ్ళ వయసు దాటినవారు మొత్తంగా సర్కారు కొలువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడినది ఆమె ధ్వజమెత్తారు. ఈ సర్కారు తీరుపై విద్యార్థి లోకం శాపనార్థాలు పెడుతున్నా తెలంగాణ పాలకుల్లో చలనం లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. వారికి కనీసం చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదని మండిపడ్డారు.