కేసీఆర్ ఏడేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన ప్రగతి ఏమీ లేదని, అయితే అవినీతిలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అయితే అవతరించిందని మాజీ డీజీ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు వినయ్కుమార్ సింగ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తాను త్వరలోనే బయట పెడతానని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని ఆయన వెల్లడించారు.
‘‘తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఏదైనా చేశారంటే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా మార్చారు. 7 ఏళ్ల కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను 7 నెలల్లో ప్రజలకు చూపిస్తాను. సర్కార్ వైఫల్యాలు బయట పెట్టేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సద్భావన యాత్ర చేస్తాను” అని మీడియా సమావేశంలో తెలిపారు.
జన సేవ సంఘ్’ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో రాజకీయేతర ఉద్యమం కొనసాగిస్తానని వీకే సింగ్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసేందుకే తెలంగాణ రాష్ట్రంలో 10 సంఘాలతో కలిసి ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న వాగ్దానాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై నిరాశ చెంది తాను వీఆర్ఎస్ తీసుకున్నానని చెప్పారు.
పార్టీలు ఎన్నికల సమయంలో ఉచిత హామీలు గుప్పించి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని, పేద వారు మరింత పేద వారవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తనతో కలిసి వచ్చే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధ మయ్యానని తెలిపారు. కొద్ది రోజుల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ని ఉద్దేశిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేకనే బ్యూరోక్రాట్స్ వీఆర్ఎస్ తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
గతంలో జైళ్ల శాఖ డీజీగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై వీకే సింగ్ విమర్శలు గుప్పించారు. జైళ్లలో ఎక్కువ శాతం మంది ఎలాంటి నేరాలు చేయని బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని వీకే సింగ్ విమర్శించారు.
More Stories
బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు
తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు
మాజీ మంత్రి హరీశ్ రావు పిఏ అరెస్ట్