ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొంటా బ్లాక్‌లోని కన్హాయిగూడ – గోపాండ్‌ జిల్లాలో ఇరువర్గాల భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది బృందం అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా బలగాలను గమనించిన మావోలు వారిపైకి కాల్పులు జరిపారు. 

దీంతో బలగాలు ప్రతిగా కాల్పులు జరుపడంతో తూటాలకు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ సునీల్‌ శర్మ ధ్రువీకరించారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నుంచి ఏడుగురు మావోలు మృతి చెంది ఉంటారని సమాచారం. ఇదిలా ఉండగా  గతవారం నారాయణపూర్‌ జిల్లాలో నక్సల్స్‌ దాడిలో ఇద్దరు ఐటీబీపీ జవాన్లు మృతిచెందారు.

కడేమెట శిబిరం నుంచి 600 మీటర్ల దూరంలో సైనికులు దాడులకు తెగబడ్డారు. బలగాలకు చెందిన ఏకే-47 రైఫిల్‌, రెండు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు, వాకీటాకీని ఎత్తుకెళ్లారు. కొద్ది రోజుల క్రితం భద్రతా దళాలు దంతెవాడ జిల్లాలో ముగ్గురు నక్సలైట్లను అరెస్టు చేశాయి. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు.