ఆగస్టు 19 కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర ఆగస్టు 19 నుండి 21 వరకు కోదాడ నుండి హైదరాబాద్ వరకు జరుపనున్నారు. ఆగస్టు 19 నుండి కోదాడలో ప్రారంభమై ఆగస్టు 21న హైదరాబాదులో ముగించే కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని బిజెపి కేంద్ర నాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సూచన మేరకు పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది.

ఆగస్టు 19 సాయంత్రం 4 గంటలకు కోదాడ లో యాత్ర ప్రారంభమవుతుంది. సూర్యాపేటలో రాత్రి బస చేస్తారు. ఈ జన ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.

మరుసటి రోజు 20వ తేదీన దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్ లో భద్రకాళి మాత దర్శనం, వరంగల్, హనుమకొండలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఖిల్లాషాపూర్ లో సర్వాయి పాపన్న గ్రామం నుండి జనగామ, ఆలేరు, యాదగిరిగుట్ట చేరుకుంటారు. 

వరంగల్ లో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించి ప్రజలకు అందిస్తున్న విధానాన్ని పరిశీలిస్తారు. ఆలేరులో పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కళాకారులు చింతకింది మల్లేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్న అనంతరం యాదగిరిగుట్టలో రాత్రి బస చేస్తారు.

21న ఉదయం భువనగిరిలో నరేంద్ర మోదీ  ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం విధానాన్ని ప్రజలకు చేరుతున్న అంశాలను రేషన్ షాప్ సందర్శించి పరిశీలిస్తారు. అనంతరం ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా నాపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద రాత్రి 7 గంటలకు సభ ఉంటుంది.

12 జిల్లాల మీదుగా, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా, 324 కిలోమీటర్లు కిషన్ రెడ్డి నేతృత్వంలో జన ఆశీర్వాద యాత్ర జరుగుతుంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతాంగానికి లాభసాటి చేసే విధంగా విధానాలు రూపొందించడం, పేద ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ – అభివృద్ధి విషయాలను ప్రధానంగా ఈ యాత్రలో ప్రస్తావిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని బిజెపి ప్రకటించింది.