హైడ్రాక్సిల్‌, నీటి అణువుల జాడ కనుగున్న చంద్ర‌యాన్‌-2

ఇస్రో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన  చంద్ర‌యాన్‌-2   చంద్రుడిపై దిగే స‌మ‌యంలో దాని రోవ‌ర్ కూలిపోయినా.. ఇందులోని ఆర్బిట‌ర్ మాత్రం ఇంకా చంద్రుని చుట్టూ తిరుగుతూ కీల‌క స‌మాచారాన్ని భూమికి చేర‌వేస్తూనే ఉంది. 

తాజాగా చంద్ర‌యాన్‌-2 ఆర్బిట‌ర్‌లోని ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీట‌ర్ (ఐఐఆర్ఎస్‌) చంద్రుడి ఎల‌క్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్ర‌మ్ నుంచి సేక‌రించిన డేటాను పంపించింది. చంద్రుడిపై ఉన్న ఖ‌నిజ మిశ్ర‌మాల గురించి తెలుసుకోవ‌డానికి ఈ స‌మాచారం ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ ఐఐఆర్ఎస్ సెన్సర్‌లోని డేటాను విశ్లేషించ‌గా.. హైడ్రాక్సిల్‌, నీటి అణువుల జాడ క‌నిపించింది. ఈ ప‌రిశోధ‌న‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను క‌రెంట్ సైన్స్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.  చంద్రుడిపై 29 నుంచి 62 డిగ్రీల ఉత్త‌ర అక్షాంశాల మ‌ధ్య వీటి జాడ‌ల‌ను గుర్తించిన‌ట్లు ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.

 అంతేకాదు చంద్రుడి పైఅక్షాంశాల్లోని సూర్య‌కిర‌ణాలు ఎక్కువ‌గా ప‌డే ప్రాంతాల్లో ఈ హైడ్రాక్సిల్‌, నీటి జాడ‌లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు కూడా తేలింది. స్పేస్ వెద‌రింగ్ అంటే సౌర గాలులు చంద్రుడి ఉప‌రిత‌లాన్ని తాకిన‌ప్పుడు ఇలా హైడ్రాక్సిల్‌, నీటి అణువులు ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ద‌ని డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ తెలిపింది.

2019లో చంద్ర‌యాన్‌-2ను ఇస్రో లాంచ్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ భూమి వైపు క‌న‌పించ‌ని చంద్రుడి భాగంపై అధ్య‌య‌నం చేయ‌డానికి ఈ మిష‌న్‌ను లాంచ్ చేశారు. అయితే చివ‌రి నిమిషాల్లో రోవ‌ర్ చంద్రుడి ఉప‌రితలంపై కుప్ప‌కూలింది.