ఆకాశంలో `కన్ను’ ప్రయోగంపై ఇస్రో సిద్ధం 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన కిరీటంలో మరో కలికి తురాయిని అమర్చుకునేందుకు సిద్ధమైంది. ఆకాశంలో ‘కన్ను’గా భావిస్తున్న భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. గాలిని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి బయల్దేరేందుకు బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. గురువారం ఉదయం 5.43 గంటలకు ప్రయోగిస్తారు. 

ఈఓఎస్-03 అని పేరు పెట్టిన ఈ ఉపగ్రహాన్ని.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండవ ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 5:43 గంటలకు జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్-ఎఫ్ 10 (జీఎస్‌ఎల్‌వీ) నుంచి ప్రయోగించనున్నారు.

ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 రాకెట్ 2,268 కిలోల జీఐఎస్‌ఏటీ-1 ని జియో-కక్ష్యలో ఉంచుతుంది. ఈ ఉపగ్రహానికి ఈఓఎస్‌-03 అనే కోడ్ ఇచ్చారు. ఇస్రో ఈ సంవత్సరం ప్రారంభించిన మొదటి ప్రాథమిక ఉపగ్రహం కూడా ఇదే. ఇంతకుముందు ఇస్రో 18 చిన్న ఉపగ్రహాలను ఫిబ్రవరి 28 న ప్రయోగించింది. వాటిలో కొన్ని స్వదేశీ ఉపగ్రహాలు, బ్రెజిల్ ప్రైమరీ శాటిలైట్‌ అమెజానియా-1 కూడా ఉన్నాయి.

ఈ ఉపగ్రహాన్ని జియో ఇమేజింగ్ శాటిలైట్-1 (జీఐఎస్‌ఏటీ-1) అని కూడా పిలుస్తారు. అంతరిక్షంలో ఉండే ఈ కన్ను సాయంతో భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్ సరిహద్దులను కూడా పర్యవేక్షించవచ్చు. ఈ కారణంగానే ఈ ఉపగ్రహాన్ని ‘ఐ ఇన్ ది స్కై’ అని పిలుస్తారు.

భూ పరిశీలన ఉపగ్రహం (ఈఓఎస్‌-03) ప్రతిరోజూ 4-5 దేశాల చిత్రాలను పంపుతుందని ఇటీవల రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ ఉపగ్రహం సహాయంతో నీటి వనరులు, పంటలు, తుఫానులు, వరదలు, అటవీ విస్తీర్ణంలో మార్పులను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.

ఈ ఉపగ్రహం భూమిపై 36 వేల కిలోమీటర్ల దూరంలో అమర్చిన తర్వాత.. అధునాతన ‘ఐ ఇన్ ది స్కై’.. అంటే ఆకాశంలో ఇస్రో ‘కన్ను’గా పనిచేస్తుంది. ఈ ఉపగ్రహం భూమి భ్రమణంతో సింక్‌ అవుతుంది. ఇది ఒకే చోట స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది.