పూర్తిస్థాయి బోర్డు సమావేశం పెట్టాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం తీరా సమావేశం ఏర్పాటు చేసే సమయానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంపై కృష్ణా, గోదావరి బోర్డులు అసహనం వ్యక్తం చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా తదుపరి కార్యాచరణపై సోమవారం జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం జరిగింది.
దీనికి తెలంగాణ గైర్హాజరైంది. ఏపీ నుంచి జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. గెజిట్ అమలుకు అవసరమైన సహకారాన్ని ఏపీ అందిస్తోందని, తెలంగాణ సహాయ నిరాకరణ చేస్తోందని ఈ సందర్భంగా ఇరు బోర్డుల అధికారులు ఆక్షేపించారు.
ప్రాజెక్టుల నిర్వహణపై ఈ నెల 14వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉందని, ఇందుకు ఇరు రాష్ట్రాల సహకారం అవసరమని చెప్పారు. బేషజాలు వదిలి బోర్డులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమన్వయ కమిటీ సమావేశానికి దూరంగా ఉంటూ పూర్తి స్థాయి బోర్డు సమావేశం పెట్టాలని తెలంగాణ పట్టుబట్టిందని, తీరా సమావేశం ఏర్పాటు చేస్తే హాజరు కాకపోవడం ఏ మాత్రం బాగోలేదని విచారం వ్యక్తం చేశారు.
బోర్డుల నిర్వహణకు 60 రోజుల్లోగా ఇరు రాష్ట్రాలు చెరో రూ.400 కోట్లు (కృష్ణాకు రూ.400 కోట్లు, గోదావరికి రూ.400 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని, దీనికోసం ఇప్పటికే లేఖలు రాశామని గుర్తుచేశారు.
ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం కొన్ని ప్రాజెక్టులకు రక్షణ కల్పించిందని ఆ ప్రాజెక్టులు గెజిట్లో లేకపోవడంపై అభ్యంతరం చెబుతున్నామని తెలిపారు. గెజిట్పై అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డులు సూచించిన నేపథ్యంలో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ప్రకటించారు.
సరిగ్గా సమావేశం జరుగుతున్న సమావేశ మందిరానికి 15 అడుగుల దూరంలో ఉన్న చాంబర్లోనే నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్, ఈఎన్సీ సి.మురళీధర్రావు, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్లు సమావేశమయ్యారు.
గెజిట్పై అభ్యంతరాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా సమీక్ష జరిపారు. ఎన్జీటీతో పాటు సుప్రీంకోర్టులో కీలక కేసులు ఉన్నందున మరో తేదీన సమావేశం జరపాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డులకు లేఖ రాసింది. ఏపీలో పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఏపీ అధికారులు సమావేశానికి వచ్చారని, తెలంగాణ అధికారులు జలసౌధలోనే ఉంటూ ఉద్దేశ పూర్వకంగానే భేటీకి దూరంగా ఉన్నారని బోర్డు అధికారులు మండిపడ్డారు.
More Stories
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు
మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్అండ్టీ
ఆకట్టుకుంటున్న జై హనుమాన్ పోస్టర్