దళిత బంధును కేసీఆర్ ఎప్పటికి అమలు చేయలేరు 

దళిత బంధు లాంటి భారీ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎప్పటికీ అమలు చేయలేరని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణ సాగర్ రావు స్పష్టం చేశారు. నిజంగా కేసీఆర్ కు దళితుల మీద చిత్త శుద్ధి ఉంటే దళిత సాధికారతకు, దళితుల సంక్షేమానికి వారు ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రాజకీయ అవకాశవాది.  కేసీఆర్ జనాలు పన్ను కట్టిన సొమ్ముతో ఓటర్లకు లంచాలివ్వడం అనే దూరలవాటుకు అలవాటు పడి ఉన్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం దళిత బంధు తో అతడు చేస్తున్నది ఇదే అని చెబుతూ దళితుల సంక్షేమం విషయంలో కేసీఆర్ కు ఏ మాత్రం చిత్త శుద్దిలేదని ధ్వజమెత్తారు.

దళితుల మూడు ఎకరాల భూమి ఇస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, లక్ష ఉద్యోగాలు,కేజీ టూ పీజీ ఉచిత విద్య అనే హామీలు ఏమయ్యాయి..? అని ప్రశ్నించారు.  2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అలాంటి వ్యక్తిని ఎలా నమ్ముతారు..? అని నిలదీశారు.

ఒక వైపు రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీస్తుంటే ఎన్నికల్లో గెలుపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారని కృష్ణ సాగర్ రావు మండిపడ్డారు. కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ మాయలో పడొద్దని,  ఆయన ఎన్నికల తాయిలాలకు లొంగొద్దని బీజేపీ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అతని దుష్పరిపాలనను గమనించాలని కోరారు.