ఆ పథకాలు మతం మారిన క్రైస్తవులకు వర్తించవు

కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు అందించే రాజ్యాంగపరమైన పథకాలు ఎస్సీ సామాజిక వర్గం నుండి క్రైస్త వంలోకి మారిన వారికి వర్తించవని కేంద్ర సామాజిక న్యాయ మరియి సాధికార శాఖ మంత్రి ఏ. నారాయణ స్వామి  పార్లమెంటులో లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1977లో కేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 341 ద్వారా ఎస్సీ సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగం, ఎన్నికల్లో కల్పించే రిజర్వేషన్లు (శాసనేతరమైనవి) కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీలకు అందించే ఇతర పథకాలను ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వారికి (బీసీ-సీలకు) కూడా వర్తింపజేస్తోంది.

ఈ అంశంపై నరసాపురం లోక్ సభ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణ రాజు పార్లమెంటులో లిఖిత పూర్వకంగా ప్రశ్నలు లేవనెత్తారు. సదరు జీవో రాజ్యాంగబద్ధమైనదేనా అంటూ వేసిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి “కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చే పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వారికి వర్తింపచేయడానికి వీలు లేదు అని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఈ విధంగా వర్తింపజేస్తే మాత్రం ఆ అంశంలో కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోదు అని తెలిపారు.

1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం జీవో నెంబర్ 341 పేరిట ఎస్సీలకు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా అందుతున్న వెసులుబాట్లు కాకుండా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్సీలకు అందించే పధకాలను ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వారికి కూడా అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఎస్సీలకు అందాల్సిన వెసులుబాట్లను ‘శాసనబద్ధమైనవి’గా, ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వారికి ఇస్తున్న వెసులుబాట్లను  ‘శాసనేతరమైనవి’గా ఆ జీవోలో అప్పటి ప్రభుత్వం పేర్కొంది.

ఈ జీవో ప్రకారం రాజ్యాంగం అందించే శాసనబద్ధమైన వెసులుబాటులజాబితాలో ఉండే విద్య, ఉపాధి/ఉద్యోగం మరియు ఎన్నికల్లో అవకాశంలో ప్రాధాన్యత.. ఈ మూడు మినహాయించి, ఎస్సీలకు అందే అన్ని రకాల ఇతర వెసులుబాట్లు ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వ్యక్తులకు అందుతాయి. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ గతంలో కేంద్ర సామాజిక న్యాయ మరియు  సాధికార మంత్రిత్వశాఖకు తమ ఫిర్యాదు పంపింది.

1950 భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకారం ఎస్సీ హోదా కలిగిన వ్యక్తులు ఇస్లాం లేదా క్రైస్తవ మతం స్వీకరిస్తే తమకున్న ఎస్సీ హోదా కోల్పోతారనేది సుస్పష్టం. కాగా క్రైస్తవంలోకి మారి, ఎస్సీ హోదా కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా ‘శాసనేతర’ రాయితీలు కల్పించడం అనేది పరోక్షంగా మతమార్పిళ్లను ప్రోత్సహించడమేనని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అభిప్రాయపడింది. గత నాలుగు దశాబ్దాల కాలంగా ఈ జీవో ఆధారంగా ఎస్సీ ప్రజలకు దక్కాల్సిన ఉచిత భూమి/ఇళ్ళు, ఉచిత కరెంట్, వడ్డీ లేని రుణాలు వంటి రాయితీలు ఎస్సీ హోదా కోల్పోయిన క్రైస్తవులకు ప్రభుత్వాల ద్వారా చేరుతుండటంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆందోళన వ్యక్తం చేసింది.లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు ప్రకారం.. జీవో నెంబర్ 341 ద్వారా ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వ్యక్తి  మూడు రకాల రాయితీలు పొందే అవకాశం కలుగుతోంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. ఎస్సీలకు అందాల్సిన (శాసనబద్ధమైనవి మినహా)  రాయితీలు/వెసులుబాట్లు
2. ఎస్సీ క్రైస్తవంలోకి మారితే బీసీ-సి జాబితాలో చేరుతారు కాబట్టి, వెనుకబడిన వర్గాల వారికి ఇచ్చే రాయితీలు
3. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అందించే సబ్సిడీలు

ఇదిలా ఉండగా.. క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు రాయితీలు కల్పించే జీవో నెంబర్ 341 అమలు విషయంలో కూడా ప్రభుత్వాలు పక్కాగా వ్యవహరిస్తున్నాయి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో జారీ అయిన ఈ జీవో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో కూడా అమలు అవుతోంది.