ఫ్లిప్‌కార్ట్‌కు ఫెమా కేసులో ఈడీ రూ 10,600 కోట్ల జరిమానా

ప్రముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. విదేశీ ప్ర‌త్య‌క్ష ప‌న్నుల చ‌ట్టాల‌ను ఉల్లంఘించిందంటూ ఫ్లిప్‌కార్ట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆ సంస్థ‌తోపాటు తొమ్మిది మందికి ఈ నోటీసులు పంపింది.

పెట్టుబడుల నిబంధనలు అతిక్రమించినందుకు రూ.10,600 కోట్ల (1.35 బిలియ‌న్ల డాల‌ర్లు) జరిమానా చెల్లించాల‌ని ఎందుకు ఆదేశించ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించింది. మూడు నెల‌ల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. 2009-15 మ‌ధ్య పెట్టుబడుల‌ను ఆక‌ర్షించ‌డానికి విదేశీ మార‌క ద్ర‌వ్య చ‌ట్టం (ఫెమా)ను ఉల్లంఘించింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈడీ ద‌ర్యాప్తు చేప‌ట్టింది.

ఫ్లిప్‌కార్ట్ సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్‌లతో పాటు 10 మందికి ఫెమా (విదేశీ మారక నిర్వహణ చట్టం)లోని వివిధ సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఈ నోటీసులు జారీ చేసినట్టు ఇడి తెలిపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గత నెలలోనే వాల్‌మార్ట్ యాజమాన్యంలోని కంపెనీకి ఈ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఫ్లిప్‌కార్ట్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించినట్లు, డబ్ల్యూఎస్ రిటైల్ తన షాపింగ్ వెబ్‌సైట్‌లో వినియోగదారులకు వస్తువులను విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయని ఇడి అధికారి తెలిపారు. ఇది చట్టం ప్రకారం నిషేధితమని తెలిపారు. జూలైలో ఇడి సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారు టైగర్ గ్లోబల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈడీ జారీ చేసిన నోటీసులపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌.. తాము ఎఫ్‌డీఐ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తున్న‌ట్లు తెలిపింది. భారత చట్టాలకు అనుగుణంగానే తమ సంస్థలో పెట్టుబడులను ఆహ్వానించామని ఓ ప్రకటనలో పేర్కొంది. అయినా ఈడీ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని వివ‌రించింది.

నోటీసుపై స్పందించడానికి వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 90 రోజుల గడువు ఇచ్చింది. అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ తన భారతీయ ఇ-కామర్స్ విభాగం ఫ్లిప్‌కార్ట్ కోసం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) తీసుకురానున్నామని ఇటీవల ప్రకటించింది.