దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. 8 రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ అధికంగా ఉన్నట్లు కూడా వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి ఇప్పుడే అంతం అయ్యేలా లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్ విషయానికి వస్తే, దేశంలో సెకండ్ వేవ్ ఇంకా సమసిపోలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో కేస్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. కేరళ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో పాజిటివిటీ ఎక్కువగా ఉన్నట్లు అగర్వాల్ తెలిపారు.
యూపీకి 4.88 కోట్ల కోవిడ్ టీకాలు, మహారాష్ట్రకు 4.5 కోట్లు, గుజరాత్కు 3.4 కోట్ల కోవిడ్ టీకాలను పంపిణీ చేసినట్లు అగర్వాల్ చెప్పారు.ఆర్ వాల్యూ అంటే.. రిప్రొడక్టివ్ రేట్ వాల్యూ. వైరస్ సంక్రమణ రెట్టింపు అవుతున్న తీరును ఈ పద్ధతిలో అంచనా వేస్తారు. ఇదో గణిత శాస్త్ర విధానంలో ఉంటుంది.
‘దేశంలో ఇంకా కరోనా తీవ్రత కొనసాగుతున్నది. డెల్టా వేరియంట్ కారణంగా ఉద్ధృతమైన సెకండ్వేవ్ ఇంకా ముగిసిపోలేదు. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ వంటి 8 రాష్ర్టాల్లో ‘ఆర్’ విలువ 1 కంటే ఎక్కువగా ఉన్నది. ఇది ఆందోళన కలిగించే అంశం’ అని కొవిడ్-19పై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యదళం అధ్యక్షుడు వీకే పాల్ హెచ్చరించారు.
సాధారణంగా ఆర్ వాల్యూ ఒకటి కన్నా తక్కువగా ఉంటే అప్పుడు వైరస్తో ముప్పు లేదు. కానీ ఒక పాయింట్ దాటితే అప్పుడు ఆర్ వాల్యూతో ప్రమాదమే ఉంటుంది. ఉదాహరణకు ఆర్ విలువ 0.90గా ఉంటే, అప్పుడు 100 మంది వల్ల 90 మందికి వైరస్ సంక్రమించినట్లు అంచనా. ఒకవేళ ఆర్ వాల్యూ ఒకటి దాటితే, అప్పుడు వైరస్ విజృంభిస్తున్నట్లు భావిస్తారు. చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఆర్ వాల్యూను ఇటీవల అంచనా వేసింది. జూన్ 30 నుంచి జూలై వరకు ఆర్ వాల్యూ పెరిగినట్లు ఆ సంస్థ పరిశోధకులు తెలిపారు.
దీంతో మళ్లీ భారత్ లో కరోనా కలవరం మొదలైంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్లో ఆర్ విలువ సగటున 1.2గా ఉన్నట్టు లవ్ అగర్వాల్ తెలిపారు. కాగా, కరోనా థర్డ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేశారు ప్రముఖ మైక్రో బయాలజిస్ట్, వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్ పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోతే అసలు మూడో వేవ్లో ఎన్నిక కేసులు వస్తాయో ఊహించడం కూడా కష్టమేనని హెచ్చరించారు.
కరోనా సెకండ్ వేవ్ నిటారు పర్వతమైతే.. మూడో వేవ్ ఓ పెద్ద కొండ అని ఆమె తెలిపారు. వైరస్ ఇలాగే మ్యుటేట్ అవుతూ, మరింత ప్రమాదకరంగా మారుతుంటే కేసుల సంఖ్య అంచనా వేయడం కష్టమని గగన్దీప్ కాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
More Stories
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన
ఐఐటీల్లో 40 శాతం మందికి ఉద్యోగాల్లేవు
ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు