అశ్లీల వీడియోల చిత్రీకరణ (పోర్నోగ్రఫీ) కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్కుంద్రా, ఆయన సహచరుడు ర్యాన్ థోర్పేలకు ముంబై హై కోర్టులో చుక్కెదురైంది. ఈ ఇద్దరి బెయిల్ అభ్యర్థనను ముంబై కోర్టు బుధవారంనాడు తిరస్కరించింది. పోర్న్ కేసులో అరెస్టైన బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాను ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే.
అయితే రాజ్ కుంద్రా తరపు న్యాయవాది బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా..బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. పోర్నోగ్రఫీ ఫిల్మ్లు తీస్తూ, యాప్ల ద్వారా వాటిని పబ్లిష్ చేస్తున్నారనే ఆరోపణలపై ఈనెల 19న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు. నీలి చిత్రాలను నిర్మించడం, ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గత ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో కుంద్రా రూ.1.17 కోట్లు ఆర్జించారని మెజిస్ట్రేట్ కోర్టులో క్రైం బ్రాంచ్ పోలీసులు తమ వాదన వినిపించారు.
ఈ ఆదాయానికి సంబంధించి కచ్చితమైన సమాచారం రాబట్టడానికి ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి పూర్తి వివరాలను కోరామని ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇంతవరకూ 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 420, 292, 293 కింద, ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్లు, మహిళలను అశ్లీలంగా చూపించారన్న చట్టం కింద కుంద్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి కొత్తగా నటి గెహనా వశిష్ట్తోపాటు రాజ్కుంద్రా కంపెనీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ముంబై క్రైం బ్రాంచ్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రాజ్ కుంద్రా కేసుకు సంబంధించి పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు ముంబై హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ..సెప్టెంబర్ 20, 2021 వరకు పూనమ్, షెర్లిన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్దేశించింది.
ఇదిలా వుంటే రాజ్ కుంద్రా ఆఫీసు మీద పోలీసులు రైడ్ చేసినప్పుడు రహస్య కప్బోర్డులను గుర్తించారు. వీటిలో ఆర్థిక లావాదేవీలు, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. కానీ రాజ్కుంద్రాను అరెస్ట్ చేసేనాటికే అక్కడ చాలామటుకు డిజిటల్ సమాచారాన్ని డిలీట్ చేశారని అధికారులు పేర్కొన్నారు.
More Stories
బెంగళూరు, శివమొగ్గలలో ఎన్ఐఎ దాడులు
బిజాపూర్ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి
ఆప్ నిరసనలతో ఢిల్లీలో మూడు మెట్రో స్టేషన్ల మూసివేత