నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కాలంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతులు ప్రదర్శనలు నిర్వహించడానికి ఢిల్లీ పోలీసులు బుధవారం అనుమతి ఇచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడుల నెలలకు పైగా ఉద్యమిస్తున్న రైతులు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సమీపంలోని జంతర్మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలకు అనుమతి కోరగా… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు.
ఢిల్లీ శివార్లలోని సింఘు నుంచి గరిష్టంగా 200 మంది రైతులు బస్సుల్లో పోలీసు ఎస్కార్ట్తో జంతర్మంతర్కు వెళ్లాలని, ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు అక్కడ నిరసన తెలుపొచ్చని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ నెల 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో జంతర్ మంతర్ వద్ద కిసాన్ పార్లమెంట్ నిర్వహిస్తామని, జులై 22 నుంచి ప్రతిరోజు 200 మంది నిరసనకారులు సింఘూ సరిహద్దుల నుంచి హాజరవుతారని రైతు సంఘాలు మంగళవారం ప్రకటించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే ఆగస్టు 13 దాకా సంయుక్త కిసాన్ మోర్చా (రైతు సంఘాల ఉమ్మడి వేదిక) అనుమతి కోరగా.. జులై 22(గురువారం) నుంచి ఆగస్టు 9 వరకు ఎల్జీ అనుమతి మంజూరు చేశారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తామని, శాంతియుతంగా ధర్నా చేస్తామని కిసాన్ మోర్చా నుంచి రాతపూర్వక హామీని పోలీసులు కోరారు. ఈ ఏడాది జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీలో హింస చోటుచేసుకున్న తర్వాత ఢిల్లీలో రైతుల నిరసనలకు అనుమతివ్వడం ఇదే తొలిసారి. కొవిడ్ పరిమితుల దృష్ట్యా మార్చ్ నిర్వహించొద్దని, తప్పనిసరిగా సామాజిక దూరం నిబంధనలు పాటించాలని ఆదేశించారు. నిరసన శాంతియుతంగా జరిగేలా విస్తృతమైన ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మంగళవారం ఢిల్లీ పోలీసు అధికారులను కలుసుకున్న అనంతరం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తామని, నిరసనకారులెవరూ పార్లమెంట్ వైపు వెళ్లబోరని తెలిపారు.
More Stories
డబ్బులేకే పోటీ చేయడం లేదు .. నిర్మలా
కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం
ఫిలిబిత్ ప్రజలతో సంబంధం రాజకీయాలకతీతం