కృష్ణబోర్డు నివేదిక కోసం కేంద్రం ఆదేశం!

తెలుగు రాష్ట్రాల మధ్యన కృష్ణానది జలవివాదాలకు సంబంధించి తాజా పరిస్థితులపై క్షేత్ర స్థాయి నివేదిక పంపాలని కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డును అదేశించినట్టు సమాచారం. బోర్డు ఛైర్మన్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఎంపి సింగ్ ఇప్పుడిప్పుడే రెండు రాష్ట్రాల మధ్యన తలెత్తిన సమస్యలపై పరిశీలన చేస్తున్నారు. 

ఇటు తెలంగాణ నుంచి, అటు ఎపి నుంచి ఒక రాష్ట్రంపైన మరోక రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదులు చేస్తు న్న నేపద్యంలో కేంద్ర జల్ శక్తి శాఖపై ఒత్తడి పెరిగింది.  ఎపికి చెందిన బిజెపి శాఖ శుక్రవారం కర్నూలు కేంద్రంగా రాయలసీమ స్థాయి పార్టీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించింది. 

ఈ సమావేశంలో పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతలతోపాటు, తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి తదితర ప్రధాన అంశాలు చర్చించారు. సమావేశం అనంతరం పార్టీ ఎంపిలు సమస్యలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌కు వివరించినట్టు సమాచారం.

రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరగా తాజా పరిస్థితులపై కృష్టాబోర్డుకు నివేదిక పంపాలని ఆదేశించినట్టు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారని సీమకు చెందిన ఆ పార్టి ఎంపి ఒకరు తెలిపారు. కృష్ణా రివర్ బోర్డు త్రిసభ్యకమిటి సమావేశాన్ని ఇప్పటికే బోర్డు ఛైర్మన్ వాయిదా వేశారు.

నీటి సంవత్సరానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల మధ్యన నీటివాటాలు కుదర్చాల్సివుంది. మరో వైపు రెండు రాష్టాలనుంచి పలు అంశాలపై ఫిర్యాదులు ఉండనే ఉన్నాయి. కృష్ణారివర్‌బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు అంశాలను అజెండాలో చేర్చాలని బోర్డుకు లేఖ రాసింది. 

రెండు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, వాటిలో వాస్తవ పరిస్థితులు తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో నివేదిక పంపాలని కేంద్రం నుంచి ఆదేశాలు బోర్డు ఛైర్మన్ ఎంపి సింగ్‌కు చేతినిండా పనికల్పిస్తున్నాయి. మరో వైపు పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించాలన్న హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.